చిత్తూరు అర్బన్: పట్టణాల్లో అభివృద్ధి పనులకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నులే. ఏటా మార్చి వస్తోందంటే మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను వసూళ్లపై ఓ ప్రణాళిక ఉంటుంది.కానీ ఈ ఏడాది అధికారులు వేసుకున్న ప్రణాళికలకు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడంలేదు. కారణం ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తామంటూ ఇటీవల రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్సుల్లో కమిషనర్లకు స్పష్టత ఇచ్చారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడకపోవడంతో పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళం నెలకొంది.
రూ.26 కోట్ల బకాయిలు
జిల్లాలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి 83,477 భవనాల నుంచి ఆస్తి పన్నులు వసూలవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లా నుంచి రూ.40.54 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, బకాయిల రూపంలో రూ.8.97 కోట్లు పేరుకుపోయాయి. మొత్తంగా రూ.56.25 కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఆదివారం నాటికి రూ.26.28 కోట్లు వసూల య్యాయి. అంటే దాదాపు 48 శాతం పన్నులు వసూలయ్యాయి. ఇంకా మిగిలిన 52 శాతం వసూళ్లు నిలిచిపోయాయి.
‘మాఫీ’పైనే ఆశలు
ఇటీవల రాష్ట్ర మున్సిపల్ పరిపాలనశాఖ అధికారు లు కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించి.., రెండు రోజుల్లో ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ జీ.వో వెలువడుతుందని ప్రకటించారు. ఇదే విషయాన్ని అధికారులు ప్రజలకు చేరవేశారు. కానీ ఈ సమావేశం జరిగి పది రోజులు కావస్తున్నా, ప్రభు త్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఫలితంగా పన్నుల వసూళ్లల్లో మందగమనం నెలకొంది.


