వీ.కోట ఉపాధి పనుల్లో గోల్మాల్ మార్చిలోపు జరిగిన పనులకు బిల్లులిచ్చేసిన వైనం
పలమనేరు: నియోజకవర్గంలోని వీకోట మండలంలో గత మూడు నెలల్లో జరిగిన ఉపాధి పనుల్లో రూ.10 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. మండలంలోని కొంగాటం పంచాయతీలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు రూ.3 కోట్ల దాకా బినామీ కూలీల ద్వారా అక్రమాలు సాగినట్టు సమాచారం.
కొంగాటంలో 21 పనుల్లోనే
రూ.కోట్లు స్వాహా
వీకోట మండలంలో గత నెల 26న కొంగాటం గ్రామంలోనే 21 పనులను 758 మంది కూలీలు చేసినట్టుగా రికార్డ్ చేశారు. వీరు నీళ్లున్న చెరువుల్లో ఫిష్పాండ్స్, ఫీడర్చానెళ్లు, బౌండరీ ట్రెంచులు చేసినట్టుగా పెట్టారు. కానీ అన్ని పనుల్లోనూ ఒకటే కూలీల గ్రూపుఫొటోను అప్లోడ్ చేసి అసలైన కూలీల కడుపుగొట్టారు.
ఇదిగో సాక్ష్యం
వీకోట మండలంలోని కొంగాటం పంచాయతీలో ఫిబ్రవరి నెలఖారు దాకా 21 పనులకు 758 మంది దాకా కూలీలు పనులు చేసినట్టు యాప్లో రికార్డు చేశారు. అయితే మార్చి 1 నుంచి ఫేషియల్ అటెండెన్స్ రాగానే కూలీలు కనిపించలేదు. మార్చి 2న కేవలం మూడే పనులు సాగుతున్నట్టు అందులో 16 మంది కూలీలు పనులు చేసినట్టుగా ఉంది. మార్చి 3న వర్క్ ఐడీ 0210062013 ఎంఎస్సార్ నెం:12194లో కాంప్రెహెన్సివ్ రిస్టోరేషన్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ ఇన్ శివునికుప్పం చెరువు పనులకు ఫిబ్రవరి నెలాఖరు దాకా పది మంది కూలీలు పనులు చేసినట్టు గ్రూప్ ఫొటో అప్లోడ్ చేశారు. కానీ మార్చి మూడున ఆ కూలీల్లో కేవలం రంగారెడ్డి అనే కూలీ మాత్రమే వచ్చినట్టు అప్లోడ్ చేశారు. అంటే కొత్త యాప్ అమలులోకి రావడంతో వీరి ఆటలు సాగలేదని తెలుస్తోంది.
శివునికుప్పం చెరువు పనుల్లో లక్షలు స్వాహా
కొంగాటం పంచాయతీలోని శివునికుప్పం చెరువు పనుల్లో జనవరి 7 నుంచి ఫిబ్రవరి 21వ తేదీ దాకా 17 మస్టర్లను జనరేట్ చేసి భారీగా కూలి పనులు చేసినట్టు ఒకే గ్రూపు ఫొటోలను అప్డేట్ చేసి రూ.69,50,024 బిల్లులు చేసుకున్నారు. ఇలాంటివి ఆ పంచాయతీలోనే మరో 20 పనులు జరిగాయి. ఇంక మండలంలో ఎన్ని అక్రమాలు జరిగే ఇట్టే అర్థమవుతోంది. ఎప్పటికప్పుడు బిల్లులు అందినట్టు ఎన్ఎంఎంఎస్ యాప్ లో కనిపిస్తున్నా అక్కడి ఏపీవో మాత్రం కొన్నింటి బిల్లులు జనరేట్ చేయలేదని చెప్పడం గమనార్హం.


