సాక్షి, టాస్క్ఫోర్స్: బంగారుపాళెం మండలంలోని మహాసముద్రం టోల్ప్లాజా వద్ద సోమ వారం రాత్రి ఘర్షణ చోటుచేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళ్తున్న కారు టోల్ప్లాజా వద్ద సిబ్బంది ఆపి టోల్ఫీజు చెల్లించాలని సూచించారు. దీంతో కారులో ఉన్న వ్యక్తులు తాము టీడీపీకి చెందిన వారమని, తమ వాహనాన్నే పంపరా..? అంటూ సిబ్బందిపై దాడికి పూనుకున్నారు. అక్కడే ఉన్న మరికొందరు అడ్డుకున్నట్లు తెలిపారు. కారులో ఉన్న వ్యక్తులు సిబ్బందిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
గాయపడిన శోభ మృతి
కార్వేటినగరం: మండలంలోని అమ్మపల్లి క్రాస్ వద్ద ఈనెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమా దంలో తీవ్రంగా గాయపడిన శోభ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండలం కేంద్రంలోని చాకలివాని గుంట ఎస్టీ కాలనీకి చెందిన అరుణ్, శోభ దంపతులతో పాటు ఏడాది చిన్నారి దీపికతో కలసి చికిత్స కోసం పల్లిపట్టుకు వెళ్తున్నారు. ఆ సమయంలో కేఎం పురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో వస్తూ వెనుక నుంచి ఢీకొట్టారు. రోడ్డుపై పడిన శోభ తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి దీప ఒంటరిగా మిగిలింది. తల్లిలేని బిడ్డను చూసి గ్రామస్తులు బోరున విలపించడం గుండెల్ని పిండేసింది.
ట్రాక్టర్ ఢీకొని ఒకరి మృతి
– మరొక్కరికి తీవ్రగాయాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆగి ఉన్న ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చిత్తూరు మండలం, ఒబ్బన్నగుంట వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. మండలంలోని ఒబ్బన్నగుంట వద్ద ఓ ట్రాక్టర్ పంక్చర్ అయ్యింది. దీంతో బండిని రోడ్డు పక్కకు పెట్టి..డ్రైవర్ కాపలా ఉన్నాడు. ఈ క్రమంలో తుమ్మింద గ్రామానికి చెందిన సంజయ్ (18), చిన్నరాజు (22) చిత్తూరు నుంచి తుమ్మింద వైపు వస్తూ ట్రాక్టర్ వెనుక వైపు బలంగా ఢీకొట్టారు. సంజయ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. చిన్నరా జు తలకు తీవ్ర గాయలు కావడంతో తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాలూకా ఎస్ఐ అశోక్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సంజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనానికి లైట్ లేకపోవడం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.
గరుడ వారధిపై ద్విచక్ర , భారీ వాహనాలు నిషేధం
తిరుపతి క్రైం : నగరంలోని గరుడవారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల భద్రత దృష్ట్యా ఇకపై గరుడ వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ రవాణావాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుపతి స్మార్ట్ సిటీ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం జూమ్ మీటింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి అంశాలతో పాటు గరుడ వారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రమాదాల వివరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు.


