చిత్తూరు అర్బన్: అసాంఘిక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి.. నేరాలను నివారించడానికి కార్డన్ సెర్చ్ ఉపయోపడుతుందని ఏఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని రైల్వే స్టేషన్ను వన్టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వరతో కలిసి తనిఖీ చేశారు. నిత్యం పోలీసుల తనిఖీల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్డన్ సెర్చ్ల ద్వారా గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరులో నాటుసారా, వంద గ్రాముల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు టూటౌన్ పరిధిలో సరైన పత్రాలు లేని కారణంగా 5 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు.
రైల్వేస్టేషన్లో తనిఖీలు
చిత్తూరు కార్పొరేషన్: ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా చిత్తూరు రైల్వేస్టేషన్లో పోలీసులు తనిఖీలు చేశారు. అందులో భాగంగా శనివారం ప్లాట్ఫాం, రైళ్లలో పర్యటించి అనుమానితుల బ్యాగులను పరిశీలించారు. అనంతరం ఇన్చార్జి ఎస్ఐ ధర్మేంద్రరాజు, ఏఎస్ఐ అశోక్ మాట్లాడా రు. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేర కు వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ తనిఖీ చేశామన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్ర మ రవాణా అంశాలను పరిశీలించామన్నారు. చివరిగా సిబ్బందితో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించామని వివరించారు. హెడ్కానిస్టేబుల్ డేవిడ్ పాల్గొన్నారు.
పరీక్షల ప్రక్రియ గందరగోళం
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పరీక్షల నిర్వహణను రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోకి తీసుకోవడంతో గందగోళ పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డిశేఖర్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఈఓల అధికారాలను కుదించడం తగదన్నారు. పరీక్షల విధుల కేటాయింపు ప్రక్రియను ఆటోమేషన్ చేయడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు. చాలామంది జూనియర్లకు విధులు కేటాయించడం దారుణమని మండిపడ్డారు.
వరసిద్ధునికి
వెండి తొండం, హస్తాలు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామివారికి శనివారం బెంగళూరుకు చెందిన భక్తుడు కిషోర్కుమార్ వెండి తొండం,హస్తాలను విరాళంగా సమర్పించారు. 2.7 కిలోల వెండి తొండం, హస్తాల విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. దాత కుటుంబానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఫుడ్ కమిషన్ చైర్మన్
నేడు జిల్లాకు రాక
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్రెడ్డి ఆదివారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ వెల్లడించారు. శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనలో చైర్మన్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేస్తారన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలిస్తారని తెలిపారు. రేషన్ షాపుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ తీరును పర్యవేక్షిస్తారని చెప్పారు.


