ఆక్రమణలు ఆపలేరా ఎట్టా?
ఇప్పటికే కట్టపై పలుచోట్ల ఆక్రమణలు తమకు సంబంధం లేదంటున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోని ఇరిగేషన్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ వాసులు
పెద్ద చెరువు కట్ట..
పలమనేరు: పట్టణ చరిత్రకు ముడిపడి విడదీయరాని సంబంధమున్న పెద్దచెరువు గోష్ట ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. ఇప్పటికే చెరువు మొరవల వద్ద భారీగా ఆక్రమణలు జరిగాయి. కట్టను సైతం చదును చేసి లేఅవుట్లకు దారులు వేసేసుకున్నారు. తూర్పు, పడ మట మొరవల వద్ద కట్టపై భారీ భవంతులు సైతం కట్టేశారు. తాజాగా మంగళవారం కొందరు కింద తమ భూమి ఉందంటూ నడికట్టపై జేసీబీతో చదును చేశారు. స్థానికులు కలత చెంది అధికారులకు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. అధికార పార్టీ నేతల అండతోనే చెరువు కట్టపై చదును చేస్తున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తవ్వకాలకు అనుమతే లేదు
పెద్ద చెరువు నిండుకుండాలా ఉంది. ఇలాంటి సమయంలో కట్టను ఎవరైనా ముట్టుకుంటే పెను ప్రమాదం తప్పదు. ఏ మాత్రం దెబ్బతిన్నా కట్ట తెగడం ఖాయం. అసలు చెరువు కట్టలను జేసీబీలతో తవ్వడం పెద్ద నేరం. చెరువు కట్ట నుంచి నిర్ధేశించిన మేర బేస్మెంట్ ఏరియాలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. ఇది బండ్ హైట్ను బట్టి పదిరెట్లుగా ఉంటుంది. ఫోర్సోర్ ఏరియాకు కట్టకు ఇది సురక్షితంగా ఉండాల్సిందే. కానీ నిబంధనలకు నీరొదిలి రైతుల నుంచి ఆయకట్టులో భూములు కొన్న రియల్టర్లు ఇస్టానుసారంగా చెరువుకట్టను జేసీబీలతో చదును చేస్తున్నారు.
వారి అండలేకుంటే వీరికింత ధైర్యమా?
గతంలోనూ పెద్ద చెరువు కట్టను జేసీబీలతో తొలగించిన వ్యవహారంలో కొందరి అధికార పార్టీ నేతల వత్తాసుందని తేలింది. ఇప్పుడు కూడా వారి ధైర్యంతోనే కట్టను తవ్వుతున్నారనే మాట వినిపిస్తోంది. కాగా ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణను వివరణ కోరగా నిబంధనలు మీకూ తెలుసుకదా..? అది తప్పేనన్నారు. అయితే తమరు డీఈ గారితో మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇరిగేషన్ డీఈ మూడే చోక్లా నాయక్కు ఫోన్ చేయగా ఆయన తెలివిగా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇక మున్సిపల్ కమిషనర్ ఎక్కడో బయటన్నాడని సమాచారం. గతంలోనూ ఇదే విషయమై కమిషనర్ రమణారెడ్డిని వివరణ కోరగా కట్ట ఏమైనా తమకు సంబంధం లేదన్నారు. పెద్దచెరువు కట్ట ఆక్రమణలు తమ పరిధిలోకి రావని.. ఇరిగేషన్ అధికారులు చూసుకుంటారన్నారు. కట్టపై పారిశుద్ధ్య పనులు, మొక్కలు నాటేది తామేనని చెప్పారు.
రియల్ ఎస్టేట్ల కోసం నడి కట్టపై జేసీబీలతో చదును


