
13న నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 13న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రముఖ కంపెనీలలో ఉన్న అప్రెంటిస్షిప్ ఖాళీలను భర్తీ చేసేందుకు పీఎం నేషనల్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేళా చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో శిక్షణ పూర్తిచేసి పాస్ అయిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. హాజరయ్యే వారు అప్రెంటిస్షిప్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, లేని పక్షంలో తమ కార్యాలయంలో సర్టిఫికెట్లతో సంప్రదించాలన్నారు.
నామినల్ రోల్స్ అందజేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) స్కాలర్షిప్ పరీక్షల నామినల్ రోల్స్ అందజేయాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రింటెడ్ నామినల్ రోల్స్, ఫీజు చలానాలను ఈ నెల 16వ తేదీలోపు ఆయా హెచ్ఎంలు డీఈవో కార్యాలయంలో అందజేయాలని డీఈవో ఆదేశించారు.
గజ ప్రజా యాప్పై విస్తృత అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : గజ ప్రజా యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలని డీఆర్వో మోహన్కుమార్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ నూతనంగా ఆవిష్కరించిన గజ ప్రజా యాప్ ఉపయోగాలను ప్రజలకు క్షేత్ర స్థాయిలో తెలియజేయాలన్నారు. వ్యవసాయ పంటల నష్టాలను నివేదించేందుకు యాప్ సహాయం చేస్తుందన్నారు. రైతులు ఈ యాప్ను వినియోగించి పంటల నష్టాల వివరాలను ఫొటోలతో సహా నేరుగా ఫోన్ నుంచి అప్లోడ్ చేయవచ్చన్నారు. ఈ ప్రక్రియ పంట నష్ట పరిహారం ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నారు. యాప్లో పంట నష్టం వివరాలను నమోదు చేస్తే వారంలోపు నష్టపరిహారం అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఏనుగుల వల్ల నష్టపోయిన పంటల వివరాలను గజ ప్రజా యాప్లో తెలుసుకోవచ్చన్నారు. త్వరలో ఈ యాప్ ను ప్రముఖుల చేతుల మీదు గా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైల్డ్ లైఫ్ నిష్ణాతులు రాకేష్, ఆర్డీవో భవాని, సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. భక్తుల వేచి ఉన్న క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 74,861 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,802 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
ప్రపంచ దృష్టి లోపం
దినోత్సవ ర్యాలీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ప్రపంచ దృష్టిలోప దినోత్సవం నిర్వహించారు. తొలుత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి, కంటి వైద్యులు అర్పిత వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం డీఐసీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దృష్టి లోపం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు వివరించారు.

13న నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా