
మమ్మల్ని ఎందుకు మోసం చేశారు?
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, కుప్పం, చిత్తూరు, పుత్తూరు పలు ప్రాంతాల నుంచి మెగా డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు డీఈవో కార్యాలయానికి విచ్చేశారు. ర్యాంకు, మార్కుల పరంగా అర్హత ఉన్న తమకు అన్యాయం జరిగిందంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. పీఈటీ, ఇతర కేటగిరిలతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఎంపికై న వారి సర్టిఫికెట్లు సమగ్రంగా విచారించలేదని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్, పీహెచ్ కేటగిరీల్లో అనర్హులకు అందలం ఎక్కించారన్నారు.
తుది జాబితాలో 1,408 మంది ఎంపిక
రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సోమవారం ప్రచురించిన మెగా డీఎస్సీ తుది జాబితాలో 1,408 మంది ఎంపికై నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లలో 1,478 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ప్రక్రియ తుది జాబితా ప్రచురణ నాటికి పలు కేడర్లలో 1,408 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. తుది ఎంపిక జాబితాలను కలెక్టరేట్, డీఈవో కార్యాలయ నోటీసు బోర్డులలో ప్రచురించారు. తుది జాబితాలో అభ్యర్థులకు ఎవరైనా అభ్యంతరాలున్నట్లైతే కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ 8498991250 నెంబర్లో తెలియజేయాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు.
‘ఏడేళ్ల నుంచి డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యా.. డీఎస్సీలో ఎంపికయ్యా. కాల్లెటర్ పంపారు. సర్టిఫికెట్లన్నీ పరిశీలించి ఓకే అన్నారు. చివరికి తుది ఎంపిక జాబితాలో ఎంపిక కాలేదని చెప్పారు’..అంటూ పలమనేరుకు చెందిన సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటే తక్కవ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టులు వచ్చాయన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక తమ ఆశలను నీరుగార్చడం అన్యాయమని ఆవేదన చెందాడు.
‘ఎస్జీటీ పోస్టుకు ఎంపికై నట్లు మెసేజ్ పంపారు. కాల్లెటర్ జారీచేశారు. సర్టిఫికెట్ల పరిశీలన మొత్తం పూర్తి చేశారు. ప్రస్తుతం తుది జాబితాలో నా పేరు లేదు..’ అని శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళా అభ్యర్థిని కన్నీరుపెట్టుకున్నారు. సోమవారం డీఈవో కార్యాలయానికి విచ్చేసిన తనకు జరిగిన అన్యాయంపై అధికారులను ప్రశ్నించారు. తన తర్వాత ర్యాంక్ ఉన్న వారికి పోస్టు ఇచ్చారని ఆరోపించారు.
ఈ ఇద్దరే కాదు.. సోమవారం చిత్తూరు డీఈవో కార్యాలయానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వందలాది మంది అభ్యర్థులు క్యూకట్టారు. కాల్లెటర్లు అందిన తమను ఎందుకు ఎంపిక చేయలేదంటూ అధికారులను ప్రశ్నించారు. ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.