
దొరికితేనే దొంగలు!
● చిత్తూరు కేంద్రంగా నకిలీ పత్రాల దందా ● తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు ● బ్యాంకును బురిడీ కొట్టించేందుకు యత్నం ● రెవెన్యూ ఉద్యోగేసూత్రధారి ● అన్ని తెలిసినా రెవెన్యూ అధికారులు మౌనం ● సాక్షి కథనంతో నకిలీ భాగోతంపై కదలికలు ● గుట్టురట్టు చేసిన పోలీసులు
చిత్తూరు అర్బన్/కాణిపాకం: చిత్తూరులో తహసీల్దార్ కార్యాలయ కేంద్రంగా నకిలీ పత్రాల దందా పెచ్చుమీరింది. ఇంటి దొంగలే ఫోర్జరీ గ్యాంగ్ను సృష్టించారు. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు.. బ్యాంకును బురిడీ కొట్టించేందుకు యత్నించారు. ఈగ్యాంగ్లో రెవెన్యూ ఉద్యోగే కీలక సూత్రధారిగా వ్యవహరించారు. తహసీల్దార్ సీలును దొంగలించారు. ఏకంగా తహసీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. రూ.కోట్ల విలువ చేసే భూములపై తప్పుడు పత్రాలు సృష్టించారు. దీనిపై సాక్షి దినపత్రిక కథనాలు వండిపెట్టింది. దీంతో ఫోర్జరీ వ్యవహరంపై కదిలికలొచ్చాయి. వెంటపడిన పోలీసులు, ముఠా గుట్టును రట్టు చేశారు. చివరకు ఫోర్జరీ ముఠా కటకటలపాలైంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు నగరంలోని అర్బన్ తహసీల్దార్గా పనిచేసిన కళావతి సంతకం ఫోర్జరీ చేసిన ఓ పత్రం ఈ ఏడాది జనవరిలో వెలుగులోకి వచ్చింది. తిమ్మసముద్రంలోని ఓ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తప్పుడు ఎంజాయిమెంట్ సర్టిఫికెట్తో కూడిన ఓ దరఖాస్తు సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లింది. తహసీల్దార్ సంతకాన్ని అనుమానించిన ఆ రిజిస్ట్రార్ ఆ పత్రాన్ని పరిశీలనలో పెట్టారు. అప్పటి తహసీల్దార్ ఇది తన సంతకం కాదని స్పష్టం చేశారంటూ చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులకు ఆ ఫోర్జరీ లొసుగులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆపై దీనిని బయటకు పొక్కనివ్వకుండా కూటమి నేతలు అడ్డుపడ్డారు.
పోలీసులకు పరీక్షే...
ఫోర్జరీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ తరుణంలో కూటమి నేతల నుంచి అడ్డంకులు వచ్చి పడ్డాయి. దీనిపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు ముందుకు కదిలింది. ఫోర్జరీ గుట్టును రట్టు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో దొంగిలించిన తహసీల్దార్ సీలు, గ్రీన్ ఇంక్ ఫెన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసు ఛేదించడం పోలీసులకు పెద్ద పరీక్షే అని చెప్పువచ్చు. కూటమి నేతలు సిఫార్సులను పట్టించుకోకుండా పోలీసు బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ముఠా చిట్టా విప్పి..కటకటాల్లోకి నెట్టారు.
కలిసొచ్చిన అవకాశం...
అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలుంటే ఓ రెవెన్యూ ఉద్యోగి పేరిట ఆరు నెలలు మరో వ్యక్తి పని చేయడానికి అవకాశం ఉంది. అయితే రెవెన్యూ అధికారులు తండ్రి పేరుతో పనిచేసే వారిని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. వాళ్లను అడ్డం పెట్టుకు ని వసూళ్లకు తెరలేపుతున్నారు. వాళ్ల చేతికే లాగిన్లు, రికార్డులు ఇచ్చి పెట్టి రెవెన్యూ సేవలను అమ్మకానికి పెట్టారు. ఇలా రూ.లక్షల్లో డబ్బులిచ్చే వారికి అప్పన్నంగా భూములను కట్టబెట్టేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా కార్లు బహుమతులు తీసుకున్నారనే చర్చ జోరందుకుంటున్నాయి. బెంగళూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి పార్టీలు, పబ్బ్ల్లో ముంచెత్తేవారని కార్యాలయ సిబ్బంది విమర్శిస్తున్నారు. తనిఖీ చేయాల్సిన ఆర్డీఓ, జేసీలు కూడా పర్యవేక్షణను పూర్తిగా మరిచిపోయారని, గతంలో జేసీగా పనిచేసిన గిరీ షా మాత్రం కార్యాలయాన్ని తనిఖీ చేసి వీఆర్వో లు, అధికారులను మందలించారని గుర్తు చేస్తు న్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రెవెన్యూ కార్యాలయంలో ఇంటి దొంగలు రెచ్చిపోయారనే వాదన వినిపిస్తోంది.
తహసీల్దార్ కార్యాలయం
ఈ గ్యాంగ్ లీడర్ ఎవరంటే...
2018 ముందు నుంచే తహసీల్దార్ కార్యాలయంలో ఫోర్జరీ వ్యవహరం నడుస్తున్నట్లు ఆరోపణులున్నాయి. చంద్రశేఖర్ తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో తహసీల్దార్ సీలు విరిగింది. ఆ సీలు దొంగ పత్రాలు సృష్టించే వ్యక్తులే ఎత్తుకెళ్లారని కార్యాలయ సిబ్బంది కోడైకూస్తూ వచ్చింది. అప్పట్లో అధికారులు మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత ఇంటి దొంగలే ఈపని చేశారనేది పోలీసుల విచారణలో తేలింది. చిత్తూరు మండలంలోని పెరుమాళ్ల కండ్రిగ రెవెన్యూ వీఆర్ఏగా వ్యవహరిస్తున్న మోహన్ ఈ సీలు చోరీ చేసి.. ఇంట్లో దాచి పెట్టి దొంగ పత్రాలకు వాడుకున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. రూ.వేలల్లో డబ్బులు తీసుకుని దొంగ సంతకాలు పెట్టడం, సీలు వేయడం, తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు పెద్ద ముఠాను ఏర్పరుచుకున్నాడని ఈకేసులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలకంగా వ్యహరించిన మోహన్ మరో వీఆర్ఏగా ఉన్న రాజశేఖర్, డాక్యుమెంట్ రైటర్ గజేంద్రకుమార్ సహకారంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న గౌతమ్, జాన్సీ సహకారంతో బ్యాంకులను రూ.లక్షల్లో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారన్న నిజాలు వెల్లడయ్యాయి. కాగా ఈ కేసుకు సంబంధించి మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోర్జరీపై ‘సాక్షి’ పట్టు
ఫోర్జరీ పత్రాల సృష్టిపై గత కొన్నేళ్లు సాక్షి దినపత్రికలో పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఎవరెవరూ..ఎలా చేస్తున్నారనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.అయితే ఇంటి దొంగల ము సుగులో పడిన అధికారులు తేలికగా తీసుకున్నా రు. తహసీల్దార్ కళావతి సంతకం ఒకటి బయటికి రాకపోయి ఉంటే ఈ ఇంటి దొంగల మరింత రెచ్చిపోయి ఉంటారు. ఈ సంతకం ఫోర్జరీ దందాను సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. కూట మి నేతల అడ్డంకులు ఉన్న వెంబడించి వార్తా కథనలు ప్రచురించింది. దీనిపై స్పందించిన తహసీల్దార్ కళావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫోర్జరీ దందా బహిర్గతమైంది. ఇంటి దొంగలతో పాటు మరో ముగ్గురు రిమాండ్లోకి వెళ్లారు.
పెరుమాళ్లకండ్రిగలో సమస్యలు కుప్పలు తెప్పలు
తండ్రి పేరుతో పెరుమాళ్ల కండ్రిగకు వీఆర్ఏగా వ్యవహరిస్తున్న మోహన్ రెవెన్యూ అధికారులను గుప్పట్లో పెట్టుకుని చక్రం తిప్పాడనే ఆరోపణలున్నాయి. సర్వే నంబర్లను మార్చడం, సరిహద్దుల్లో హెచ్చు తగ్గులున్నాయని సమస్యలను సృష్టించి ఆదాయ వనరులు మార్చుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గ్రామ కంఠం భూములను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రభుత్వ భూములను కుటుంబసభ్యులు, బంధువుల పేరుతో పట్టాలిప్పించినటు్ల్ వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు తిమ్మసముద్రం, ప్రశాంత్నగర్, ఇరువారం ప్రాంతాల్లో తప్పుడు పత్రాలు సృష్టించి, పలు స్థలాలకు పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కొ పట్టాకు రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేసినట్లు కార్యాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు.