పెరిగిపోతున్న కోవిడ్‌ కేసులు, ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌?! | Wipro Says Takes Necessary Precautions To Make Sure All Safeguard Employees Over Rising Covid Sub-Variant JN.1 Cases - Sakshi
Sakshi News home page

పెరిగిపోతున్న కోవిడ్‌ కేసులు, ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌?!

Dec 26 2023 1:48 PM | Updated on Dec 26 2023 2:46 PM

Wipro Says Takes Necessary Precautions To Make Sure All Safeguard Employees Over Rising Covid Sub-Variant JN.1 Cases - Sakshi

దేశంలో పెరిగిపోతున్న కోవిడ్‌-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయిదాటి పోతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసుల నమోదు తీవ్రతరమైతే మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్పిస్తే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం.   

ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ వర్క్‌ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్లయింట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఓ వైపు సంస్థ వృ‍ద్ది కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. 

‘‘నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. మేం ఇచ్చిన ఆదేశాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం.”అని విప్రో ఈ సందర్భంగా వెల్లడించింది. 



వారానికి మూడు రోజులు ఆఫీస్‌లోనే
ప్రముఖ టెక్‌ దిగ్గజం విప్రో కరోనా కారణంగా ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని ఆదేశించింది. అయితే, గత నెల నవంబర్‌ 15 నుంచి సిబ్బందికి హైబ్రిడ్‌ వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిర్ధేశించిన సమయం నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబట్టింది. వారికి కేటాయించిన ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని ఆదేశించింది. ప్రస్తుతం ఈ హైబ్రిడ్‌ విధానంలో విప్రో ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్‌కు వస్తే..మరో రెండు రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కోవిడ్‌-19 కేసులతో తిరిగి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

విస్తరిస్తోన్న కరోనా
కనుమరుగైందనుకున్న మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. కోవిడ్‌-19 వైరస్‌ రెండేళ్లపాటు బతుకుపై భయం పుట్టించింది. దేశీయంగా టీకాలు అందుబాటులోకి రావడంతో వైరస్‌ పీడ విరగడైందని భావించినా కొన్నాళ్లకు రూపు మార్చుకుంది. కోవిడ్‌-19, డెల్టా వేరియంట్‌, ఒమిక్రాన్‌.. ప్రస్తుతం జేఎన్‌1 వైరస్‌గా మన ముందుకొస్తోంది. డిసెంబర్‌ 26, మంగళవారం నాటికి దేశంలో 4,100 దాటాయి. గడిచిన 24 గంటల్లో 412 మందికి వ్యాపించింది.

Advertisement
 
Advertisement
Advertisement