
ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' సుంకాలను ప్రకటించిన తరువాత.. యూఎస్ మార్కెట్లు కుప్పకూలాయి. రెండు సెషన్లలలోనే ఇన్వెస్టర్లు ఆరు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టపోయారు. కరోనా మహమ్మారి తరువాత స్టాక్ మార్కెట్లు ఇంతలా పతనమవ్వడం ఇదే మొదటిసారి. అయితే ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.
ట్రంప్ పరస్పర సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి వెళ్తాయనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ జీడీపీ తగ్గుతుందని, ఉద్యోగాలు కూడా ఉండవని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ సమయంలో కూడా అమెరికా అధ్యక్షుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో ఆర్ధిక మాంద్యం వస్తుందని అందరూ భయపడుతుంటే.. ట్రంప్ మాత్రం ఇన్వెస్టర్లు ధనవంతులు అవ్వడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది సువర్ణావకాశమని, చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వారు ధనవంతులు అవుతారని ఆయన అన్నారు.
పెద్ద కంపెనీలు లేదా పెద్ద వ్యాపార సంస్థలు ఎప్పుడూ టారీఫ్స్ గురించి ఆందోళన చెందవు. ఎందుకంటే అవి ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. మరింత పెద్ద డీల్స్ మీద ఫోకస్ చేస్తాయి. ఇవే దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తాయి.. సూపర్ ఛార్జ్ మాదిరిగా పనిచేస్తాయని అన్నారు.
ఇదీ చదవండి: 'అమెరికాలో ఉద్యోగాలుండవు'.. నిపుణులు ఎందుకు చెబుతున్నారంటే?
విదేశీ వస్తువులను వినియోగించడం తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులపై ఫోకస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సుంకాలను ప్రవేశపెట్టారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చి వేయడం మాత్రమే కాకుండా.. దేశంలో ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని డొనాల్డ్ ట్రంప్ విశ్వసిస్తున్నారు.