
ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య సుంకాల భయాలతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతం మేర నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 636 పాయింట్లు నష్టపోయి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,543 వద్ద నిలిచింది. సూచీలకిది మూడో రోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.
ఇంధన, ఫైనాన్స్, ఐటీ షేర్లలో భారీగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 799 పాయింట్లు క్షీణించి 80,575 వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 24,502 వద్ద కనిష్టాన్ని తాకాయి. అమెరికా తయారీ రంగం వరుసగా మూడోనెలా తగ్గుముఖం పట్టడంతో పాటు చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎనిమిది నెలల్లో తొలిసారి క్షీణించినట్లు డేటా రావడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు బలహీనపడి 86.61 వద్ద స్థిరపడింది.
⇒అదానీ గ్రూప్ ముంద్రా రేవు ద్వారా కొన్ని కంపెనీలు ఇరాన్ ఎల్పీజీ దిగుమతి చేసుకునేందుకు సహకరించిందనే ఆరోపణల నేపథ్యంలో గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ పోర్ట్స్, ఎన్డీటీవీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజస్ 2.50% – 2% క్షీణించాయి.
⇒ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.105)తో పోలిస్తే 19% ప్రీమియంతో రూ.125 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 24% ఎగసి రూ.130 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 20% లాభంతో రూ.126 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.743 కోట్లకు చేరింది.