
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర దాడులు, ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు విధించడానికి గడువు సమీపిస్తుండటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ప్రతికూలంగా పయనించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 82.79 పాయింట్లు (0.10 శాతం) క్షీణించి 81,361.87 వద్ద స్థిరపడింది. గురువారం ఈ సూచీ 81,583.94 - 81,191.04 శ్రేణిలో ట్రేడ్ అయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 18.80 పాయింట్లు (0.08 శాతం) క్షీణించి 24,793.25 వద్ద స్థిరపడింది.
అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు 2.50 శాతం నుంచి 1.28 శాతం మధ్య క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, మారుతీ సుజుకీ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, లార్సెన్ అండ్ టుబ్రో 1.57-0.32 శాతం మధ్య లాభపడ్డాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.63 శాతం, 1.99 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్ లలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ మొత్తం మార్కెట్ ధోరణులను అధిగమించి, పాజిటివ్ గా క్లోజ్ అయిన ఏకైక సెక్టోరల్ ఇండెక్స్ గా అవతరించింది. ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో లాభాలతో సూచీ 0.52 శాతం లాభపడింది.
మరోవైపు నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.04 శాతం నష్టంతో ముగిసింది. ఆ తర్వాత నిఫ్టీ మెటల్, మీడియా, రియల్టీ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. మిగిలిన అన్ని రంగాల సూచీలు కూడా గురువారం నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఒడిదుడుకులను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.14 శాతం క్షీణించి 14.26 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,954 షేర్లలో 2,363 నష్టాల్లో ముగియగా, 516 లాభపడ్డాయి. 75 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)