
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 81,237 వద్ద కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 138.64 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 41.35 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 24,812.05 వద్ద ముగిసింది.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.46 శాతం, 0.23 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మీడియా 1.27 శాతం నష్టపోగా, నిఫ్టీ ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రియల్టీ, ఎనర్జీ, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
టీసీఎస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ షేర్లు 1.6 శాతం వరకు నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్ 4.4 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్లలో ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.89 శాతం క్షీణించి 14.27 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం తీవ్రతరం కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నాటాంజ్ వద్ద ఇరాన్ భూగర్భ యురేనియం కర్మాగారం దెబ్బతిన్నదన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు ఐదో రోజు కూడా కొనసాగాయి.
దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, భవిష్యత్తులో రేట్ల కోత, ముడిచమురు ధరలు పెరగడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాలపై చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు.