కిలోకి రూ.11,250 నష్టం
బంగారానికీ అమ్మకాల సెగ
10 గ్రాములు రూ.1,900 తగ్గుదల
న్యూఢిల్లీ: వెండి, బంగారం మరోసారి అమ్మకాల ఒత్తిడికి కుదేలయ్యాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.11,250 నష్టపోయి రూ.2.3 లక్షలకు దిగొచ్చింది. బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,900 తగ్గి రూ.1,47,800 స్థాయికి చేరింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం బులియన్ మార్కెట్లు పనిచేయలేదు. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 37 డాలర్లు లాభపడి 4,416 డాలర్ల స్థాయి వద్ద, వెండి ఔన్స్కు స్వల్ప లాభంతో 68.12 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. ‘‘చమురు ధరలు బలహీనపడడంతో బంగారం ధర 4,420 డాలర్ల వరకు వెళ్లింది. కానీ, తర్వాత చమురు ధరల పెరుగుదలతో దిగొచ్చింది’’అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్సింగ్ తెలిపారు. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా సమీప కాలంలో బులియన్ ధరలను ప్రభావితం చేయొచ్చన్నారు.


