రూ. లక్ష కోట్లకు రెడీ ∙ఐటీ మంత్రి వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: చిప్ తయారీ తదుపరి దశలో భాగంగా ప్రభుత్వం సెమీకాన్ 2.0ను ప్రకటించడంతో భారీ పెట్టుబడులకు ఆసక్తి కనిపిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా పేర్కొన్నారు. సుమారు 11–12 బిలియన్ డాలర్ల(రూ. లక్ష కోట్లు) సెమీకండక్టర్ పెట్టుబడులకు కట్టుబాటు ప్రదర్శించినట్లు వెల్లడించారు. వెరసి చిప్ తయారీ తదుపరి దశలో భాగంగా కనీసం లక్ష కొత్త ఉద్యోగాల సృష్టికి వీలున్నట్లు తెలియజేశారు.
ఎక్విప్మెంట్, మెటీరియల్స్, గ్యాసెస్, కెమికల్స్సహా అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏటీఎంపీ) యూనిట్స్ తదితరాలలో పెట్టుబడులకు కట్టుబాటు కనిపిస్తున్నట్లు వివరించారు. రెండు, మూడేళ్లలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులకు తెరలేవనున్నట్లు సెమీకాన్ ఇండియా 2026 సదస్సు సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైష్ణవ్ తెలియజేశారు. అయితే పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
పలు కంపెనీలు ఇందుకు సిద్ధపడుతున్నప్పటికీ ఆయా సంస్థల బోర్డులు, వాటాదారుల నుంచి అనుమతి పొందిన తరువాతే ఇందుకు వీలున్నట్లు తెలియజేశారు. నిజానికి పెట్టుబడులు ప్రారంభమయ్యాక లక్షకంటే చాలా అధికంగా ఉద్యోగాలు లభించనున్నాయని అభిప్రాయపడ్డారు. దేశీ సెమీకండక్టర్ పరిశ్రమలో సెమీకాన్ 2.0 ద్వారా పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ ఏర్పాటుకానున్నట్లు పేర్కొన్నారు. చిప్ డిజైన్, ఎక్విప్మెంట్, మెటీరియల్స్, ఫ్యాబ్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ఆర్అండ్డీ, నైపుణ్యం తదితరాలకు వీలున్నట్లు వివరించారు. సెమీకాన్ 1.0 ఫౌండేషన్కు శ్రీకారం చుట్టగా.. సెమీకాన్ 2.0 మరింత పురోభివృద్ధి బాటలో సాగనున్నట్లు వివరించారు.


