అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ తొలిసారిగా తమ గ్రూప్లోని రెండు సంస్థల ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ను (ఎసాప్స్) ప్రకటించింది. రిలయన్స్ ఇన్ఫ్రా (ఆర్ఇన్ఫ్రా), రిలయన్స్ పవర్లోని 2,500 మంది ఉద్యోగులకు ఇవి లభిస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది.
దీని ప్రకారం రూ. 10 ముఖ విలువ గల షేరును అదే విలువకు ఉద్యోగులకు కేటాయిస్తారు. దీర్ఘకాలంగా, నమ్మకంగా కొనసాగుతున్న చాలా మటుకు ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా నవంబర్ 3న ఎసాప్స్ ప్రతిపాదనకు షేర్హోల్డర్లు ఆమోదం తెలిపినట్లు కంపెనీ వివరించింది. రిలయన్స్ గ్రూప్లో 28,000 మంది ఉద్యోగులు, రూ. 1,07.123 కోట్ల అసెట్స్ ఉన్నాయి.
రిలయన్స్ ఇన్ఫ్రా సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో నికర లాభం 50% తగ్గి రూ.1,911 కోట్లకు పడిపోయింది. ఇది ఒక సంవత్సరం క్రితం రూ.4,082 కోట్లుగా ఉంది. ఆదాయం కూడా రూ.7,346 కోట్ల నుంచి రూ.6,309 కోట్లకు తగ్గింది. వృద్ధి కార్యక్రమాల కోసం 600 మిలియన్ డాలర్ల సమీకరణ ప్రణాళికలను కంపెనీ ఇటీవల ప్రకటించింది.
రిలయన్స్ పవర్ రెండో త్రైమాసికంలో గణనీయంగా పుంజుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.352 కోట్ల నష్టం నుండి రూ.87 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇబిటా 64శాతం పెరిగి రూ.618 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.634 కోట్ల రుణాన్ని తీర్చేసింది. దాని డెట్-టు-ఈక్విటీ నిష్పత్తిని 0.87 కు తగ్గించుకుంది.
రిలయన్స్ గ్రూప్పై నియంత్రణ సంస్థలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈడీ చర్యల తరువాత రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తు చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ ఇటీవల రూ .7,500 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.


