బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. కేజీ వెండి రేటు రూ. 2 లక్షలు దాటిన సందర్భం కూడా ఉంది. ప్రస్తుతం దేశంలో సిల్వర్ రేటు రూ. 1.70 లక్షల (కేజీ) వద్ద ఉంది. ఈ తరుణంలో రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక ప్రకటన జారీ చేసింది. గోల్డ్ మాదిరిగానే.. సిల్వర్ మీద కూడా లోన్ ఇవ్వడానికి సన్నద్ధమైంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. వెండి నగలు, కాయిన్స్ వంటి వాటిని తాకట్టు పెట్టుకుని లోన్ మంజూరు చేయాలని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. వెండి కడ్డీలు, ఈటీఎఫ్లను తాకట్టుపెట్టడానికి అవకాశం లేదు. వీటిపై లోన్ లభించదు.
ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టుపెట్టుకోవచ్చు. 500 గ్రాముల వరకు బరువున్న సిల్వర్ కాయిన్స్ కూడా బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ బరువున్న వెండిని తాకట్టు పెట్టుకోకూడదని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి. మొత్తం మీద వెండిపై రూ. 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. బంగారం మాదిరిగానే.. వెండి మార్కెట్ విలువ ఆధారంగా బ్యాంకులు లోన్ మంజూరు చేయడం జరుగుతుంది.
ఇదీ చదవండి: ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!
వెండి రేటు పెరగడానికి కారణాలు
వెండిని కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా.. పూజ సామాగ్రిగా కూడా ఉపయోగిస్తారు. పారిశ్రామిక రంగంలో కూడా సిల్వర్ డిమాండ్ భారీగా పెరగడం చేత.. వెండి రేటుకు రెక్కలొచ్చేశాయి. సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, ఉత్ప్రేరకాలు, నీటి శుద్ధి, వైద్య రంగం, ఫొటోగ్రఫీ వంటి వాటిలో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల సిల్వర్ రేటు గణనీయంగా పెరిగింది.


