మసాలా దినుసుల తయారీ కంపెనీ పుష్ప్ బ్రాండ్ (ఇండియా) పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇండోర్ (మధ్యప్రదేశ్) కంపెనీ ఇందుకు అనుమతించాలంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా కంపెనీ రూ. 800–1,000 కోట్ల మధ్య సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి.
ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 74.45 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. 1974లో ఏర్పాటైన కంపెనీ బ్రాండెడ్ ప్యాకేజ్డ్ మసాలాలు, ఆహార పదార్ధాలను తయారు చేస్తోంది. విస్తరణలో భాగంగా కంపెనీ 2028కల్లా పర్యావరణహిత తయారీ కేంద్రంతోపాటు.. సమీకృత స్టోరేజీ సౌకర్యాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
ఈ బాటలో పూర్తిస్థాయి శుద్ధ మసాలాలకు వీలుగా 2029కల్లా గ్రైండింగ్, మిల్లింగ్ లైన్కు తెరతీసే ప్రణాళికలు వేసింది. కాగా.. ప్యాకేజ్డ్ మసాలాల విభాగంలో ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఓర్క్లా ఇండియా, ఎండీహెచ్, బాద్షా మసాలా తదితర సుప్రసిద్ధ కంపెనీలతో పోటీ పడుతోంది. గతేడాది(2025–26) రూ. 482 కోట్ల టర్నోవర్ సాధించడంతోపాటు.. రూ. 59 కోట్ల నికర లాభం ఆర్జించింది.


