ప్రభుత్వ లోన్‌ స్కీమ్‌: కొత్త నియమాలు.. ప్రయోజనాలు | PM SVANidhi Yojana Extended Till 31 March 2030; Check New Loan Rules | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ లోన్‌ స్కీమ్‌: కొత్త నియమాలు.. ప్రయోజనాలు

Sep 5 2025 3:08 PM | Updated on Sep 5 2025 3:34 PM

PM SVANidhi Yojana Extended Till 31 March 2030; Check New Loan Rules

చిరు వ్యాపారులు, వీధి విక్రేతలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి, అంటే పీఎం స్వనిధి యోజన కాలపరిమితిని ఇప్పుడు 31 మార్చి 2030 వరకు పొడిగించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రారంభమైన ఈ పథకం కొత్త నియమాలు, ప్రయోజనాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిని చిన్న వ్యాపారులు, వీధి విక్రేతలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 2020 జూన్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. వారు మళ్లీ స్వయం సమృద్ధి సాధించడం దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా చిరు వ్యాపారులకు రోజువారీ వ్యాపార అవసరాల
కోసం వెంటనే డబ్బు అవసరం పడుతుంటుంది. కానీ వారికి బ్యాంకు నుండి రుణం పొందడం అంత సులభం కాదు. ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారి ఈ సమస్యను ఈ పథకం పరిష్కరిస్తుంది.

పథకం వ్యవధి, రుణ పరిమితి పెంపు
పీఎం స్వనిధి యోజన కాలపరిమితిని కేంద్ర కేబినెట్ ఇటీవల పొడిగించింది. దీంతోపాటు మరికొన్ని ప్రధాన మార్పులు చేసింది. ఇప్పుడు ఈ పథకం 2030 మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఇందుకోసం రూ.7,332 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పథకంలో లబ్ధిదారులకు మూడు విడతలుగా రుణం అందిస్తారు. మొదటి విడతలో గతంలో రూ.10,000 రుణం ఇచ్చేవారు. ఇప్పుడు  దాన్ని రూ.15,000వేలకు పెంచారు. ఇది తిరిగి చెల్లించాక రెండో విడత రూ.20 వేలు గతంలో ఇస్తుండగా ఇప్పుడు రూ.25,000 ఇస్తున్నారు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత మూడో విడతగా రూ.50,000 రుణం లభిస్తుంది.

ఇతర ప్రయోజనాలు
ఈ పథకం కింద  ప్రభుత్వం 7% వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. అంటే మీరు బ్యాంక్‌కు చెల్లించే వడ్డీపై 7% వరకు ప్రభుత్వం తిరిగి మీ ఖాతాలో జమ చేస్తుంది. అలాగే సకాలంలో వాయిదాలు చెల్లించే విక్రేతలకు రూపే క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇది వారి వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం డబ్బును సులభంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. ఇది కాకుండా, డిజిటల్ చెల్లింపులను అవలంబించేవారికి రూ .1,600 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ప్రయోజనం అందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement