
భారతదేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నివసించిన ఢిల్లీలోని అత్యంత ఐకానిక్ హెరిటేజ్ ప్రాపర్టీలలో ఒకటైన బంగ్లా అమ్ముడుపోయింది. భారతదేశ చరిత్రలో దీన్ని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ డీల్గా భావిస్తున్నారు. లుటియన్స్ ఢిల్లీ నడిబొడ్డున ఉన్న 17 మోతీలాల్ నెహ్రూ మార్గ్ (గతంలో యార్క్ రోడ్)లో ఉన్న ఈ విశాలమైన బంగ్లాను ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త సుమారు రూ.1,100 కోట్లకు కొనుగోలు చేశారు.
వారసత్వానికి శాశ్వత చిహ్నం
ఈ బంగ్లా కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న తొలినాళ్లలో ఇది ఆయన అధికారిక నివాసంగా ఉండేది. కాలక్రమేణా, ఇది భారతదేశ రాజకీయ, నిర్మాణ వారసత్వానికి శాశ్వత చిహ్నంగా మారింది.
14,973 చదరపు మీటర్లు (సుమారు 3.7 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీ 1912- 1930 మధ్య ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించిన ప్రత్యేకమైన లుటియన్స్ బంగ్లా జోన్ (ఎల్బిజెడ్) లో ఉంది. ప్రధానంగా కేంద్రమంత్రులు, సీనియర్ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు నివసిస్తున్న సుమారు 3,000 బంగ్లాలకు నిలయంగా ఉన్న ఎల్బీజెడ్ రాజధానిలో అత్యంత ఉన్నత ప్రాంతంగా పరిగణించబడుతుంది.
రికార్డ్ బ్రేక్ డీల్..
ఈ బంగ్లాకు తొలుత రూ.1,400 కోట్లు ధర చెప్పినట్లు సమాచారం. అయితే చర్చల అనంతరం ఈ డీల్ రూ.1,100 కోట్లకు ఖరారు అయింది. అయినప్పటికీ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాపర్టీ డీల్ ఇదే కావడం గమనార్హం.
ఈ ప్రాపర్టీలో దాదాపు 24,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉంది. చుట్టూ పచ్చని తోటలు, బహిరంగ ప్రదేశాలు ఉన్నాయి. ఇది లుటియన్స్ ఢిల్లీ గ్రాండ్ డిజైన్ నైతికతకు విలక్షణమైనది.
కొన్నదెవరు?
ఈ బంగ్లాకు ప్రస్తుత యజమానులు రాజకుమారి కక్కర్, బీనా రాణి రాజస్థానీ రాజకుటుంబానికి చెందిన వారసులని భావిస్తున్నారు. న్యాయ, ఆర్థిక మధ్యవర్తుల ద్వారా ఈ విక్రయాన్ని నడిపించారు. ఒక ప్రముఖ న్యాయ సంస్థ యాజమాన్య బదిలీని పర్యవేక్షిస్తోంది.
అయితే ఈ బంగ్లాను ఎవరు కొన్నారన్నది బహిరంగంగా వెల్లడించనప్పటికీ, కొన్నది బేవరేజ్ పరిశ్రమకు చెందిన వ్యాపారవేత్త అని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ లీగల్ క్లియరెన్స్ చివరి దశలో ఉందని, ఆ తర్వాత అధికారికంగా బదిలీ పూర్తవుతుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: Real Estate Alert: 18న బాచుపల్లి ప్లాట్ల ఈ–వేలం