ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు.. 16 ఏళ్లలోపు వినియోగదారులను తొలగించాలని ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదించింది. ఈ నిబంధనలను పాటించకపోయితే.. టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం 2025 డిసెంబర్ 10 వరకు గడువు ఇచ్చింది.
ఆస్ట్రేలియా పార్లమెంట్ విధించిన.. అండర్-16 సోషల్ మీడియా నిషేధాన్ని పాటించడానికి తాము (మెటా, టిక్టాక్ & స్నాప్చాట్) సిద్ధమని ప్రకటించాయి.
చట్టానికి మేము కట్టుబడి ఉన్నప్పటికీ.. దీనిని అమలు చేయడం కష్టమని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజాలు వెల్లడించాయి. అయితే.. ఇలాంటి చట్టాన్ని విధించడం పట్ల ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. డిసెంబర్ 10 నాటికి 16 ఏళ్లలోపు లక్షలాది మంది వినియోగదారులను గుర్తించడం.. వారిని తొలగించడం అనేది చాలా పెద్ద సవాలు. దీనిని పరిష్కరించడం అంత సులభం కాదని మెటా పాలసీ డైరెక్టర్ మియా గార్లిక్ అన్నారు.
వయసుకు సంబంధించిన సోషల్ మీడియా నిషేధం అనేది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని టిక్టాక్ ఆస్ట్రేలియా పాలసీ లీడ్ ఎల్లా వుడ్స్ జాయిస్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. అస్పష్టం, సమస్యాత్మకం, తొందరపాటు చర్యగా టెక్ కంపెనీలు విమర్శించాయి. 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియా నిషేధం విధించడం అనేది.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిషేధాలలో ఒకటిగా పరిగణించబడుతుందని అన్నాయి.
ఇదీ చదవండి: ఇంటర్నేషనల్ నంబర్లతో యూపీఐ చెల్లింపులు


