
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది జనవరి 1 నుంచి తన అన్ని రకాల కార్ల ధరల్ని 3 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జీఎల్సీ మోడల్ నుంచి టాప్ఎండ్(ఖరీదు శ్రేణి) మేబాక్ ఈక్యూఎస్ 680 మోడల్ వరకు కారు ధరను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల మేర ఈ పెంపు ఉంటుందని పేర్కొంది.
‘‘అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ పెరుగుదల వ్యాపార కార్యకలాపాలపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, రవాణా ఖర్చులతో గత మూడు త్రైమాసికాల నుంచి నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో ధరల పెంపు నిర్ణయం తప్పలేదు’’ అని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు బుక్ చేసుకునే వాహనాలకు మాత్రం పెంపు వర్తించదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్లు