బీవైడీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం | Massive Fire BYD Shenzhen HQ Parking Garage Sparks Safety Concerns | Sakshi
Sakshi News home page

బీవైడీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Apr 14 2026 6:26 PM | Updated on Apr 14 2026 7:15 PM

Massive Fire BYD Shenzhen HQ Parking Garage Sparks Safety Concerns

బ్యాటరీ లోపం కాదని స్పష్టం చేసిన కంపెనీ

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దిగ్గజం బీవైడీ ప్రధాన కార్యాలయం ఉన్న షెన్‌జెన్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పింగ్షాన్ జిల్లాలోని కంపెనీ ప్రాంగణంలో ఉన్న ఒక మల్టీస్టోర్‌ పార్కింగ్ గ్యారేజీలో ఈ మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.

ప్రమాదం జరిగిన తీరు

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫుటేజీ ప్రకారం.. బహుళ అంతస్తుల భవనంలోని ఒక విభాగం నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై బీవైడీ ప్రతినిధి స్పందిస్తూ, ‘మంటలు చెలరేగిన ప్రాంతం కేవలం పరీక్షలు పూర్తి చేసుకున్న, స్క్రాప్ చేసిన (పాత) వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ గ్యారేజీ మాత్రమే’ అని వివరించారు.

ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన అంశాలు

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగితే అవి బ్యాటరీ లోపం వల్లేననే ఆందోళన వ్యక్తమవుతుంటుంది. కానీ, ఈ ఘటనపై స్థానిక అగ్నిమాపక శాఖ, బీవైడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  • ఈ ప్రమాదానికి బ్యాటరీ సెల్ఫ్-ఇగ్నిషన్ (స్వయంగా మంటలు అంటుకోవడం) లేదా నాణ్యత లోపాలు కారణం కాదని దర్యాప్తులో తేలింది.

  • గ్యారేజ్ ప్రాంతంలో జరిగిన అశాస్త్రీయ బాహ్య నిర్మాణ కార్యకలాపాల వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు.

  • ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాహనాలకు లేదా ఉత్పత్తిలో ఉన్న కొత్త వాహనాలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని కంపెనీ భరోసా ఇచ్చింది.

ఈవీలో మంటలు.. నిపుణుల హెచ్చరిక

సాధారణ పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలను ఆర్పడం సవాలుతో కూడుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈవీ బ్యాటరీల్లో మంటలు ఒకసారి ఆరిపోయినట్లు అనిపించినా అవి మళ్లీ మళ్లీ రాజేసుకునే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే వీటిని ఆర్పేందుకు ఎక్కువ సమయం పడుతుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

ఈ తాజా ప్రమాదం సాంకేతిక లోపం కాదని తేలినప్పటికీ గతంలో బీవైడీ కొన్ని భద్రతా సమస్యలను ఎదుర్కొంది. సెప్టెంబర్ 2024లో స్టీరింగ్ కంట్రోల్ యూనిట్‌లో తయారీ లోపం కారణంగా సుమారు 97,000 ‘డాల్ఫిన్, యువాన్ ప్లస్’ మోడళ్లను రీకాల్ చేసింది. జనవరి 2025లో అగ్ని ప్రమాద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో 6,843 ‘బావో 5’ హైబ్రిడ్ ఎస్‌యూవీలను రీకాల్‌ చేసింది.

ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Advertisement
 
Advertisement
Advertisement