ఆటో మొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ త్వరలో కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. వాహన ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత మార్కెట్లో నెలకొన్న బలమైన డిమాండ్, పెరుగుతున్న ముడి సరుకుల వ్యయాల దృష్ట్యా ధరల పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు.
‘కమోడిటీల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విలువైన లోహాల (ప్రెషస్ మెటల్స్) ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాము. రాబోయే రోజుల్లో వాహనాల ధరల పెంపుపై సమీక్ష చేయనున్నాం’ అన్నారు.
ధరల పెంపుపై తర్వలో నిర్ణయం
మార్కెట్ లీడర్గా ఉండటం వల్ల, ఖర్చు పెరుగుదల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు కస్టమర్ల మీద భారం పడకుండా ప్రయత్నిస్తాం. కొంత వరకు మేం ఖర్చులను భరించగలం. కానీ, పెద్ద మొత్తంలో భరించలేని పరిస్థితి నెలకొంది. కచ్చితంగా కొనుగోలుదారుల మీదకి బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే, త్వరలో ధరల పెరుగుదల గురించి కీలక నిర్ణయం వెలువరిస్తాం’’అని బెనర్జీ అన్నారు.
ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్
అటు ఉత్పత్తి పరిమితుల కారణంగా ఆలస్యంగా డెలివరీలు తీసుకుంటున్న కస్టమర్ల కోసం మారుతి సుజుకి జనవరిలో ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ‘‘ఫోర్ వీలర్ విభాగానికి వస్తున్న మొదటిసారి కస్టమర్లను మేం గమనిస్తున్నాం. వారిని అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల, మేము ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్ ను తీసుకొచ్చాం. అందుకే, ధరల పెరుగుదల అనేది వారికి ఉండదు’’ అని బెనర్జీ చెప్పుకొచ్చారు.
పెండింగ్లో 1.75 లక్షల ఆర్డర్లు
జనవరిలో 2.78 లక్షల బుకింగ్లు వచ్చాయి. అయితే పరిమితమైన ఉత్పత్తి సామర్థ్యం కారణంగా కంపెనీకి ప్రస్తుతం 1.75 లక్షల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే రోజుకు 9,000–10,000 ఆర్డర్లు వస్తున్నయన్నారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోందన్నారు. గతేడాది జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఎంట్రీ లెవల్ మోడళ్లలో ధరలను తగ్గించింది. సెప్టెంబర్ 2025లో ఎస్–ప్రెస్సో ధరలను రూ. 1.29 లక్షల వరకు, ఆల్టో కే10 ధరలను రూ. 1.07 లక్షల వరకు, సెలెరియో ధరలను రూ. 94,100, వ్యాగన్ ఆర్ ధరలను రూ. 79,600 వరకు తగ్గించింది.
ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు


