దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మే 1వ తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా ఇంధన ధరలపై పడుతోంది. ధరల పెంపుతో పాటు, మే నెల నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఆకాశాన్నంటుతున్న ధరలు
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ధరల భారాన్ని వినియోగదారులపై గత నెలలోనే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు రూ. 60పెరిగింది. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1వ తేదీన చమురు సంస్థలు నిర్వహించే నెలవారీ సమీక్షలో ధరలు మరోసారి సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొత్త బుకింగ్ నిబంధనలు ఇవే!
కేవలం ధరలే కాకుండా, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది.
బుకింగ్ గ్యాప్: నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్కు, మరో బుకింగ్కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.
OTP తప్పనిసరి: గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత ప్రామాణీకరణ ఇకపై శాశ్వతం కానుంది. సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.
ఆన్లైన్ బుకింగ్: ప్రస్తుతం 98% బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండగా, మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.
ఆధార్ ఈ-కేవైసీ ఎవరికి అవసరం?
గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీపై (e-KYC) సామాన్యుల్లో ఉన్న గందరగోళానికి అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఆర్థిక సంవత్సరంలో ఏడు రీఫిల్స్ పూర్తయ్యాక, ఎనిమిదో సిలిండర్ నుండి సబ్సిడీ పొందాలంటే ఈ ప్రామాణీకరణ అవసరం. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.


