అన్సెక్యూర్డ్ రుణాల్లోకి ప్రస్తుతం నో ఎంట్రీ
కంపెనీ ఎండీ హితేష్ సేథియా
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జేఎఫ్ఎస్) ఈ ఏడాదే లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ సేవలు ఆరంభించనున్నట్టు సంస్థ ఎండీ హితేష్ సేథియా ప్రకటించారు. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతులపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సంస్థ ఇటీవలే అలియాంజ్తో కలసి రీఇన్సూరెన్స్ వ్యాపారాన్ని ప్రారంభించడం గమనార్హం.
జీవిత, సాధారణ బీమా వ్యాపారాలు ప్రారంభించేందుకు వీలుగా బృందాలను సిద్ధంచేసే పనిలో ఉన్నట్టు సేథియా చెప్పారు. అన్సెక్యూర్డ్, కన్జ్యూమర్ డ్యురబుల్ రుణాల్లోకి ప్రవేశించే తక్షణ ప్రణాళికేదీ లేదని స్పష్టం చేశారు. లాభదాయకత పెంచుకోవడమే తమకు ప్రస్తుత ప్రాధాన్యతగా పేర్కొన్నారు. రిస్క్, మూలధనం పరంగా తమకు కొన్ని పరిమితులున్నాయని.. ప్రైమ్ కస్టమర్లకు (అధిక విలువ కలిగిన/ప్రీమియం), సెమీ ప్రైమ్ కస్టమర్లకు సెక్యూర్డ్ రుణాలపైనే ప్రస్తుతం కంపెనీ దృష్టి సారించినట్టు చెప్పారు.
ఈ వ్యూహంలో భాగంగా కస్టమర్లకు మెరుగైన ఆఫర్లను అందించనున్నట్టు తెలిపారు. కన్జ్యూమర్ డ్యురబుల్స్, అన్ సెక్యూర్డ్ రుణాల్లో రుణ ఎగవేతలు (ఎన్పీఏలు) ఎక్కువగా ఉన్నాయంటూ, గృహ రుణాల్లో ఒకింత ఇదే పరిస్థితి ఉన్నట్టు చెప్పారు. ‘‘మా ఎన్బీఎఫ్సీ వ్యాపారం, లాభదాయకత మా రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగానే ఉన్నాయి. మా కస్టమర్లు, వ్యాపారాలపై మరింత అధ్యయనం అవసరం. తగిన సమయంలో కొత్త రుణ విభాగాల్లోకి ప్రవేశించడంపై పరిశీలన చేస్తాం’’అని సేథియా తెలిపారు. జియో ఫైనాన్స్ కేవలం ఇతర బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలకు సంబంధించి వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులులను ప్రస్తుతం తన జియోఫైనాన్స్ యాప్పై ఆఫర్ చేస్తుండడం గమనార్హం.
ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల


