
పెట్టుబడులకు సంబంధించి ఏ పోర్ట్ఫోలియోకైనా రాబడుల ధోరణే కీలకంగా ఉంటుంది. ఉదాహరణకు ఓ సందర్భాన్ని ఊహించుకోండి. మీకు ఇష్టమైన క్రికెట్ టీమ్ భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో ప్రారంభంలోనే ఓ అయిదు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బాగానే ఆడినా, మ్యాచ్ పూర్తయ్యేంతవరకు టీమ్పై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. అలా కాకుండా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్రారంభంలోనే భారీ స్కోర్ చేస్తే టీమ్పై ఒత్తిడి తగ్గుతుంది. గెలిచే అవకాశాలూ కాస్త మెరుగ్గా ఉంటాయి. దీన్నే ఇన్వెస్టింగ్ కోణంలో ఒకసారి చూద్దాం. రాము, కృష్ణ ఇద్దరూ ఒకేసారి ఒకే తరహాలో రూ. 1 కోటి కార్పస్తో రిటైరయ్యారు.
ఏటా రూ. 5 లక్షల చొప్పున విత్డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే పదేళ్లలో రూ. 50 లక్షలు విత్డ్రా చేసుకున్నారు. పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్లపై వచ్చే రాబడులతో పదేళ్ల తర్వాత, రాము నిధి రూ. 37.32 లక్షలు పెరగ్గా, కృష్ణ నిధి రూ. 58.52 లక్షలు పెరిగింది. రెండింటి మధ్య వ్యత్యాసం ఏకంగా 36 శాతం ఏర్పడింది. నిర్దిష్ట వ్యవధిలో మొత్తం విత్డ్రా చేసుకున్నది, ఆఖర్లో ఉన్న బ్యాలెన్స్ను కలిపితే రాము మొత్తం రూ. 87.32 లక్షలు ఆర్జించినట్లు కాగా, కృష్ణ రూ. 1.08 కోట్లు (రూ. 50 లక్షలు + రూ. 58.52 లక్షలు) ఆర్జించినట్లయింది. 2015–19 మధ్య కాలంలో వరుసగా అయిదేళ్ల పాటు నెగటివ్ రిటర్న్స్ నమోదై, రూ. 50 లక్షలు విత్డ్రా చేసుకున్నప్పటికీ కృష్ణ నిధి అసలు మొత్తం మీద మరో రూ. 8.52 లక్షల మేర పెరిగింది.
పదేళ్లలో రాము రాబడులనేవి –5%, –6%, –15%, –8%, –4%, 5%,7%,9%,11%, 9%గా నమోదయ్యాయి. అదే సమయంలో దీనికి భిన్నంగా కృష్ణ రాబడులు 9%, 11%, 9%, 7%,5%,–4%, –8%, –15%, –6%, –5%గా నమోదయ్యాయి. రాము బేర్ ఫేజ్లో పెట్టుబడులు ప్రారంభించగా, కృష్ణ బుల్ ఫేజ్లో పెట్టుబడులు పెట్టారు. ఇలా పెట్టుబడులు పెట్టే సమయమనేది పోర్ట్ఫోలియోపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. ఇద్దరు ఇన్వెస్టర్లు తమ సేవింగ్స్ నుంచి ఒకే స్థాయిలో విత్డ్రా చేస్తున్నా, అసలు మొత్తం భిన్నంగా ఉండటం వల్లే ఇద్దరి రాబడుల్లో అంతరానికి కారణమైంది.
ఉదాహరణకు తొలి ఏడాది మార్కెట్లు 5 శాతం పడి, రూ. 5 లక్షలు విత్డ్రా చేసుకున్నప్పుడు రాము కార్పస్ రూ. 90 లక్షలకు తగ్గిపోయింది. కానీ కృష్ణ కూడా అంతే మొత్తం విత్డ్రా చేసుకున్నప్పటికీ తొలి ఏడాదిలో 9 శాతం రాబడి రావడంతో ఆయన బ్యాలెన్స్ రూ. 1.04 కోట్లకు పెరిగింది. కృష్ణ పెట్టుబడులపై ఆరో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు నెగటివ్ రాబడులే వచి్చనప్పటికీ, చివరికి వచ్చే సరికి రాము స్థాయి ప్రతికూల ప్రభావం కృష్ణపై పడలేదు. తొలి ఐదేళ్లలో రాము పెట్టుబడులపై రాబడులు క్షీణించడంతో పాటు ఏటా రూ. 5 లక్షలు వెనక్కి తీసుకుంటూ ఉండటమనేది అతని పోర్ట్ఫోలియో విలువపై బాగా ప్రతికూల ప్రభావం చూపింది.
రాబడులు వచ్చే తీరుతెన్నులు ఏ విధంగా పోర్ట్ఫోలియోను ప్రభావితం చేస్తాయనేది ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడే రిటైరీలకు ఇది మరీ ముఖ్యమైన విషయం. ఈ కాన్సెప్టు థియరీ ప్రకారం కరెక్టే అయినప్పటికీ .. సరైన సమయంలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమనేది ఎవరికైనా కష్టమే. ముఖ్యంగా రిటైరీలకు మరింత సమస్యగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రస్థానంలో రిటర్న్ రిసు్కల సీక్వెన్స్ను పరిగణనలోకి తీసుకుని ప్లానింగ్ చేసుకోవడం కీలకంగా ఉంటుంది.
‘బకెటింగ్’తో రిసు్కలకు చెక్..
చారిత్రకంగా సెన్సెక్స్ వరుసగా రెండేళ్ల పాటు 1986–87, 1995–97, 2000–01లో క్షీణించింది. అయితే, మరింత లోతుగా పరిశోధిస్తే (నెలవారీ లేదా రోజువారీ రిటర్నులు) ఇలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి. బకెటింగ్ విధానంతో ఇన్వెస్టర్లు ఇలాంటి రిస్కులను అధిగమించవచ్చు. ఈ విధానంలో కార్పస్ను స్వల్పకాలికం (ఫిక్సిడ్ ఇన్కం పోర్ట్ఫోలియో), మధ్యకాలికం (హైబ్రిడ్), దీర్ఘకాలిక (ఈక్విటీ) ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి, అదనంగా మరో ఆదాయ మార్గాన్ని కూడా ఏర్పర్చుకుంటే, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు బఫర్గా పని చేస్తుంది.
ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు తమ విత్డ్రాయల్ రేటును తగ్గించుకుని, ఏదైనా ఫిక్సిడ్ యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేయొచ్చు లేదా డెట్, బంగారం, రీట్లు, ఇంటర్నేషనల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పోర్ట్ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించవచ్చు. తద్వారా మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టపోయే అవకాశాలను తగ్గించుకోవచ్చు.
కార్పస్ ఫండ్ నుంచి విత్డ్రా చేసుకునే యోచనతో, భారీ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను రూపొందించుకుంటున్నప్పుడు, రాబడుల తీరుతెన్నులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. భారీ టార్గెట్ను ఛేదించేటప్పుడు ప్రారంభంలోనే వేగంగా స్కోర్ చేస్తే గెలిచే అవకాశాలు ఎలాగైతే ఎక్కువగా ఉంటాయో, పెట్టుబడుల ప్రస్థానంలో తొలినాళ్లలో మెరుగైన రాబడులు రావడం వల్ల మీ పోర్ట్ఫోలియో తుది విలువపై సానుకూల ప్రభావం ఉంటుంది. - అజిత్ మీనన్ ,సీఈవో, పీజీఐఎం ఇండియా ఎంఎఫ్