వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం | 100X multibagger Abhishek Bachchan investment portfolio | Sakshi
Sakshi News home page

వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం

Dec 3 2025 9:19 PM | Updated on Dec 3 2025 9:19 PM

100X multibagger Abhishek Bachchan investment portfolio

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన సినీ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే, తెర వెనుక ఒక శక్తివంతమైన వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. తాజా అంచనాల ప్రకారం, క్రీడా ఫ్రాంఛైజీల యాజమాన్యం నుంచి గ్లోబల్ బ్రాండ్‌ల్లో వ్యూహాత్మక పెట్టుబడుల వరకు విస్తరించిన అతని వ్యాపార సామ్రాజ్యం నికర విలువ సుమారు రూ.280 కోట్లుగా ఉంది. హరూన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం అమితాబ్ బచ్చన్ నేతృత్వంలోని బచ్చన్ కుటుంబం మొత్తం విలువ రూ.1,630 కోట్లుగా ఉంది.

జైపూర్ పింక్ పాంథర్స్ (JPP)

అభిషేక్ బచ్చన్ 2014లో ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో జైపూర్ పింక్ పాంథర్స్ (జేపీపీ) జట్టును కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ పెట్టుబడి విలువ 100 రెట్లు పెరిగిందని తానే స్వయంగా వెల్లడించారు. పీకేఎల్ ప్రారంభ సంవత్సరం (2014)లోనే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఈ జట్టు రెండో సీజన్ నుంచి ఆర్థికంగా లాభదాయకంగా మారింది. పీకేఎల్ సీజన్-12 ఆక్షన్‌లో జేపీపీ రైడర్ నితిన్ కుమార్ ధంఖర్‌ను రూ.1 కోటికి కొనుగోలు చేసింది.

ఫుట్‌బాల్.. చెన్నైయిన్ ఎఫ్‌సీ (CFC)

కబడ్డీతో పాటు అభిషేక్‌కు ఫుట్‌బాల్ పట్ల ఉన్న ఆసక్తితో 2014లో ఎంఎస్ ధోనీతో కలిసి చెన్నైయిన్ ఎఫ్‌సీ (ఐఎస్‌ఎల్) సహ-యాజమానిగా మారారు. 2025-26 సీజన్‌లో కూడా జట్టు పోటీ పడుతోంది. ఇటీవల అక్టోబరు 2025లో జరిగిన ఏఐఎఫ్‌ఎఫ్‌ సూపర్ కప్‌లో క్లిఫర్డ్ మిరాండా నేతృత్వంలో పాల్గొంది.

రియల్ ఎస్టేట్, స్టార్టప్ పెట్టుబడులు

అభిషేక్ బచ్చన్ తన పోర్ట్‌ఫోలియోలో రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆహార బ్రాండ్‌లలో పెట్టుబడులు పెట్టారు. 2020 నుంచి 2024 మధ్య బచ్చన్ కుటుంబం భారతదేశవ్యాప్తంగా రూ.220 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసింది. 2024లో ముంబైలోని ఒబెరాయ్ రియల్టీస్ ఎటర్నియాలో రూ.24.95 కోట్లకు 10 అపార్ట్‌మెంట్లను (అభిషేక్ 6, అమితాబ్ 4), బోరివలిలోని ఒబెరాయ్ స్కై సిటీలో రూ.15.42 కోట్లకు 6 అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు.

2015లో సింగపూర్ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ ‘జిడ్డు’లో చేసిన రూ.2 కోట్ల పెట్టుబడి 2017లో లాంగ్ ఫిన్ కార్ప్ కొనుగోలు సమయంలో బిట్‌కాయిన్ పెరుగుదల వల్ల రూ.112 కోట్ల భారీ లాభాన్ని ఇచ్చింది. ఓప్రా విన్ఫ్రే వంటి ప్రముఖులు ఆమోదించిన వహ్దామ్‌ టీ లేబుల్‌లో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. జెప్టో, జీక్యూ‌ఐ వంటి స్టార్టప్‌లలో కూడా పెట్టుబడి పెట్టారు.

నిర్మాతగా..

అమితాబ్ బచ్చన్ యాజమాన్యంలోని ఏబీ కార్ప్ (AB Corp)లో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పా (2009), షమితాబ్ (2015), ఘూమర్ (2023) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. పా చిత్రం జాతీయ అవార్డులను గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement