- భారత ఎగుమతులకు ఊపు.. ఆశాజనకంగా పర్ఫార్మన్స్
- ప్రపంచ మార్కెట్లలో విస్తరిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’
భారత ఎగుమతుల పర్ఫార్మన్స్ 2026 ఏప్రిల్లో ఆశాజనకంగా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న సమయంలో కూడా భారత్ తన ఎగుమతి మార్కెట్లను విస్తరించడంలో ముందడుగు వేసినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.
ప్రభుత్వం, పరిశ్రమల వర్గాలు కలిసి కొత్త మార్కెట్లను అన్వేషించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ వాణిజ్య అవరోధాల మధ్య కూడా 2026 ఏప్రిల్లో భారత సరుకు ఎగుమతులు దాదాపు 14 శాతం పెరిగి 43.66 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఈ పెరుగుదలలో కొంత భాగం అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల వచ్చినప్పటికీ, మరింత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. భారత ఎగుమతిదారులు చేరుకుంటున్న మార్కెట్ల సంఖ్య గణనీయంగా పెరగడం.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఏడాదిలో కనీసం 20 ఎగుమతి విభాగాలకు చెందిన ఉత్పత్తులు 17 లేదా అంతకంటే ఎక్కువ కొత్త దేశాలకు చేరాయి. ఉదాహరణకు, భారత హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అదనంగా 29 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఈ కొత్త మార్కెట్లలో ఎగుమతుల పరిమాణం ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉన్నప్పటికీ, కొత్త మార్గాలను తెరవడం ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆర్గానిక్ ఇనార్గానిక్ కెమికల్స్ వంటి భారత ప్రధాన ఎగుమతి రంగాలు గత ఏడాదితో పోలిస్తే 2026 ఏప్రిల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి.
మరో కోణంలోనూ మెరుగైన ప్రదర్శన
ఇది ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ సామర్థ్యాన్ని మాత్రమే కాదు, కొత్త సరఫరా గొలుసులు కూడా ఏర్పడుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. భారత ఎగుమతుల బలాన్ని అంచనా వేయడానికి మరో ప్రమాణం.. పెట్రోలియం ఉత్పత్తులు వాటి ధరల ప్రభావాన్ని పక్కనపెట్టి చూసే గణాంకాలు.
ఈ కోణంలో కూడా భారత్ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2026 ఏప్రిల్లో చమురుేతర ఎగుమతులు 9 శాతం పెరిగి దాదాపు 40 బిలియన్ డాలర్లకు చేరాయి. ముఖ్యంగా భారత సరుకు ఎగుమతుల వృద్ధి, దిగుమతుల వృద్ధిని మించి ఉండటం గమనార్హం.
అయితే పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో వచ్చిన భారీ పడిపోయిన ధోరణి కొనసాగుతూ ఏప్రిల్లో పశ్చిమాసియాకు భారత ఎగుమతులు 28 శాతం తగ్గాయి. ఆ ప్రాంతం నుంచి దిగుమతులు కూడా సుమారు 32 శాతం పడిపోయాయి.
ఇది భారత్కు అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామ్య ప్రాంతం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర ప్రాంతాల్లో వచ్చిన లాభాలు ఈ నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయి. ఇదే సమయంలో ‘సేఫ్ అసెట్’గా భావించే బంగారం దిగుమతులు ఏప్రిల్లో 82 శాతం ఎగసిపడ్డాయి.
భారతీయులు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని పిలుపునివ్వడం, ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడం వెనుక ఇదే కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్లోబల్ ట్రేడ్ పవర్గా భారత్!
మరో ముఖ్యమైన అంశం సేవారంగ ప్రాధాన్యం పెరుగుతుండటం. 2014లో భారత మొత్తం ఎగుమతుల్లో సేవారంగం వాటా 39 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది దాదాపు 49 శాతానికి చేరుకుంది. అయితే, ఇక్కడే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు (AI) వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఐటీ సేవల రంగంలో భారత పోటీ సామర్థ్యం తగ్గితే అది పెద్ద దెబ్బ కావచ్చని సూచిస్తున్నారు. అయినప్పటికీ, వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఎగుమతి గమ్యస్థానాలను విస్తరించడం వంటి ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
ఇకపై వ్యయం, నాణ్యత, ఉత్పత్తి పరిమాణం పరంగా భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని మరింత పెంచగలిగితే.. భారత్ నిజమైన గ్లోబల్ ట్రేడ్ పవర్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. - వెబ్ డెస్క్


