దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో ఇథనాల్, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా పెంచే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్ 1989లో ఉద్గారాల నిబంధనలను సవరించేందుకు పలు ప్రతిపాదనలు చేసింది. ఈ85 (85 శాతం ఇథనాల్ కలిసిన పెట్రోల్), ఈ100 (పూర్తిగా ఇథనాల్ మీదే నడిచే వాహనాలు), బీ100 బయోడీజిల్, హైడ్రోజెన్–సీఎన్జీ మేళవించిన ఇంధన వినియోగానికి కూడా చోటు కల్పించేలా ఇవి ఉన్నాయి. ఇంధన దిగుమతులను, కర్బన ఉద్గారాలపరమైన కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ఇవి దోహదపడనున్నాయి.
ఇప్పటికే దేశీయంగా ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధనాన్ని వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదనలపై 30 రోజుల పాటు ప్రజలతో సంప్రదింపులు జరిపిన మీదట సవరణలు చేయనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ ఏప్రిల్ 27న ఒక గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. వాహన కాలుష్య నిబంధనలకు సంబంధించి తేలికపాటి వాణిజ్య వాహనాల బరువు పరిమితిని అంతర్జాతీయ ప్రమా ణాలకు అనుగుణంగా 3,000 కేజీల నుంచి 3,500 కేజీలకు పెంచడం మొదలైనవి ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ సవరణతో అన్ని విభాగాల్లోను ఫ్లెక్స్ ఫ్యూయల్, పూర్తిగా బయోఫ్యుయల్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.
ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన


