దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ భారీ బదిలీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు అండగా నిలవనుంది.
గత ఏడాది బదిలీ చేసిన రూ.2.68 లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువైనప్పటికీ మార్కెట్ నిపుణుల అంచనాల కంటే స్వల్పంగా తక్కువ కావడం గమనార్హం. అదే సమయంలో, పెరిగిపోతున్న ప్రపంచ ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా తన కంటింజెంట్ రిస్క్ బఫర్ (భవిష్యత్తులో వచ్చే ఊహించని ఆర్థిక నష్టాలు, మార్కెట్ ఒడిదుడుకులు లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్బీఐ పక్కన పెట్టే అత్యవసర నిధి) కూడా ఆర్బీఐ గణనీయంగా పెంచింది.
ఆర్థిక ఒత్తిళ్ల నడుమ వెసులుబాటు
ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరల అస్థిరత, సబ్సిడీల భారం, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు వంటి సవాళ్లను కేంద్రం ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఆర్బీఐ నుంచి అందిన ఈ రికార్డు డివిడెండ్ ప్రభుత్వ ఖజానాకు గట్టి ఉపశమనాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ముఖ్యంగా ఇరాన్పై అమెరికా యుద్ధం) కమ్ముకుంటున్న వేళ ద్రవ్యలోటును అదుపులో ఉంచడానికి ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయనే అంశంపై ఆర్థికవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం?


