ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, మార్కెట్లోకి సరికొత్త 'హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్ టెక్ 2.0' (Super Splendor XTEC 2.0) బైక్ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 86,500 గా నిర్ణయించారు. యువతను, రోజువారీ ప్రయాణికులను ఆకర్షించేలా రిఫ్రెష్డ్ డ్యూయల్-టోన్ గ్రాఫిక్స్, 3D ఎంబ్లమ్, స్పోర్టీ రిమ్ టేపులతో ఈ బైక్ను మరింత ప్రీమియం లుక్లో డిజైన్ చేశారు.
ఇందులో అమర్చిన 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 10.7 బీహెచ్పీ పవర్, 10.6 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, i3S టెక్నాలజీల సహాయంతో ఇది లీటరుకు ఏకంగా 72 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
సాంకేతికత విషయానికి వస్తే.. ఈ బైక్లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రైడర్లు ప్రయాణంలోనే ఇన్కమింగ్ కాల్స్, SMS నోటిఫికేషన్లు, మిస్డ్ కాల్ అలర్ట్లు, ఫోన్ బ్యాటరీ స్టేటస్ను నేరుగా స్క్రీన్పైనే చూసుకోవచ్చు. వీటితో పాటు రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో-ఫ్యూయల్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ కోసం 2A USB టైప్-సి పోర్ట్ను కూడా ఇందులో జతచేశారు.
భద్రత, రైడింగ్ కంఫర్ట్కు ఈ సరికొత్త మోడల్లో పెద్దపీట వేశారు. సూపర్ స్ప్లెండర్ సిరీస్లోనే మొదటిసారిగా ఇందులో 'హజార్డ్ లైట్లను' ప్రవేశపెట్టారు. మెరుగైన బ్రేకింగ్ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, హ్యాండిల్బార్పైనే ఇంజన్ కిల్ స్విచ్ను అందించారు. లాంగ్ రైడింగ్లోనూ సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా విశాలమైన సీటు, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ సస్పెన్షన్ను అమర్చారు. ప్రస్తుతం ఈ బైక్ గ్లోసీ బ్లాక్, మ్యాట్ నెక్సస్ బ్లూ సహా ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో దేశవ్యాప్తంగా ఉన్న హీరో డీలర్షిప్లలో విక్రయానికి సిద్ధంగా ఉంది.


