స్టాక్‌ మార్కెట్‌లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నమోదు | Govt Plan For Regional Rural Banks to Raise Resources By Listing On Stock Exchanges | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నమోదు

Oct 3 2022 12:30 PM | Updated on Oct 3 2022 12:30 PM

Govt Plan For Regional Rural Banks to Raise Resources By Listing On Stock Exchanges - Sakshi

న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)లను లిస్టింగ్‌కు అనుమతించడం ద్వారా పెట్టుబడుల సమీకరణ మార్గాలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశలో ఆర్‌ఆర్‌బీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టేందుకు వీలుగా ఆర్థిక శాఖ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రాథమిక మూలాలు తదితర అంశాలను రూపొందించింది. వీటి ప్రకారం గత మూడేళ్లలో కనీసం రూ. 300 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా నిబంధనలు డిమాండ్‌ చేస్తున్న 9 శాతం లేదా అంతకుమించిన కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌)ని గత మూడేళ్లలో నిలుపుకుని ఉండాలి. 

ఈ బాటలో మూడేళ్లుగా లాభాలు ఆర్జిస్తుండటంతోపాటు.. గత ఐదేళ్లలో మూడేళ్లు కనీసం రూ. 15 కోట్లు నిర్వహణ లాభం సాధించిన సంస్థనే లిస్టింగ్‌కు అనుమతిస్తారు. సంస్థ నష్టాలు నమోదు చేసి ఉండకూడదు. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు ఈక్విటీపై కనీసం 10 శాతం రిటర్నులు అందించిన సంస్థకు పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు అర్హత లభిస్తుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో ఆర్‌ఆర్‌బీలు వ్యవసాయ రంగానికి రుణాలందించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీలలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటాను కలిగి ఉంటోంది. మరో 35 శాతం సంబంధిత పీఎస్‌యూ బ్యాంకుల వద్ద, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement