
భారత్కు చెందిన ఇండిగో ఎయిర్లైన్స్ టర్కీ ఏవియేషన్ కంపెనీ అయిన టర్కిష్ ఎయిర్లైన్స్తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన రెండు బోయింగ్ 777-300ఈఆర్ ఎయిర్క్రాఫ్ట్లను ఇండిగో లీజుకు తీసుకొని నడుపుతోంది. ఈ డీల్ మే31తో ముగుస్తుండగా, మరో ఆరు నెలలు పొడిగించాలని ఇండిగో సంస్థ భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది. అయితే ఆ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.
టర్కిష్ ఎయిర్లైన్స్తో లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా రద్దు చేయాలని ఇండిగోను కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబి ఏవియేషన్కు ఇటీవల సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేసిన తరువాత ఈ పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి.
ఇండిగో వినియోగిస్తున్న టర్కీ సంస్థకు చెందిన రెండు విమానాలకు లీజు అనుమతి మే 31తో ముగుస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధ్రువీకరించింది. ఈ లీజు పొడిగింపు ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్లు డీజీసీఏ తెలిపింది. అందుకు బదులుగా స్వల్పకాలిక ఉపశమనం ఇచ్చినట్లు పేర్కొంది. ప్రయాణీకుల సేవలకు తక్షణ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆగస్టు 31 వరకు మూడు నెలలపాటు అనుమతులు పొడిగించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ పొడిగింపును మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ పునరుద్ధరించబోమని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: ఆస్టన్ మార్టిన్తో రియల్మీ జట్టు
పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో భారత పౌరులను కిరాతకంగా చంపిన ఘటన నేపథ్యంలో భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ను అమలు చేసింది. ఈ తరుణంలో పాక్ సైన్యానికి టర్కీ మద్దుతుగా నిలిచిందని భారత్ ఆరోపిస్తోంది. దాంతో ఆ దేశంలోని సంస్థలతో క్రమంగా సంబంధాలు తెంచుకుంటోంది. అందులో భాగంగానే దేశీయ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.