Gautam Adani Said China Will Feel Increasingly Isolated - Sakshi
Sakshi News home page

చైనాపై అదానీ సెటైర్లు, ‘ఇంట కుమ్ములాటలు.. బయట ఏకాకి!’

Sep 27 2022 6:09 PM | Updated on Sep 27 2022 6:52 PM

Gautam Adani Said China Will Feel Increasingly Isolated - Sakshi

పెరుగుతున్న జాతీయవాదం, సప్లై చైన్లలో మార్పులు, సాంకేతిక నియంత్రణల కారణంగా పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో చైనా క్రమ క్రమంగా ఏకాకిగా మారుతోందని బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సింగపూర్‌లో జరిగిన 20 ఎడిషన్‌ ఫోర్బ్స్‌ గ్లోబల్‌ సీఈవోల కాన్ఫిరెన్స్‌లో అదానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెరుగుతున్న జాతీయవాదం, సప్లై ఛైన్‌లో మార్పులు, సాంకేతిక నియంత్రణలతో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనాకు ముప్పు వాటిల్లుతుందని, తద్వారా ఇతర దేశాల సంబంధాల విషయంలో ఆ దేశం మరింత ఒంటరి అవుతుందని భావిస్తున్నామని అన్నారు. 

చైనాను తిరస్కరిస్తున్నాయ్‌
చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను అనేక దేశాలు తిరస్కరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కోవిడ్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగంతో ఇతర రంగాల ఆటుపోట్లు..మిత్ర దేశాలతో కయ్యానికి కాలుదువ్వడంపై ఎద్దేవా చేశారు. డ్రాగన్‌ కంట్రీలో స్థిరాస్థిరంగం కుప్పకూలిపోవడాన్ని..జపాన్ 1990లో ఎదుర్కొన్నస్థితితో ఆయన పోల్చారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఆర్థిక మార్పులు కాలక్రమేణా సర్ధుకుంటాయని, అయితే అది చాలా కష్టమని చెప్పారు. 

వడ్డీ రేట్ల పెంపుపై 
చైనా,ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్‌ సీఈవో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టేసే విధంగా  సెంట్రల్‌ బ్యాంకులు ఊహకి అందని విధంగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయని ఈ సందర్భంగా అదానీ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement