ఏప్రిల్లో రూ.60,847 కోట్లు ఔట్
గత కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలు చేపడుతున్నారు. ఫలితంగా ఏప్రిల్లో నికరంగా రూ. 60,847 కోట్ల(6.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి 4 నెలల్లో(జనవరి–ఏప్రిల్) రూ. 1.92 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. వెరసి 2025 పూర్తి కేలండర్ ఏడాదిలో నమోదైన రూ. 1.66 లక్షల కోట్లకంటే అధికంగా అమ్మకాలకు తెరతీశారు. పశ్చిమాసియా సంక్షోభానికితోడు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యాలను దెబ్బతీయడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 4 నెలల్లో ఫిబ్రవరిలో మాత్రమే ఎఫ్పీఐలు(రూ. 22,615 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇది అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంకావడం గమనార్హం! అయితే మార్చిలో ఏకంగా రూ. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం ప్రస్తావనార్హం!!
గత వారమిలా..
తొలుత క్యూ4 ఫలితాలతో మార్కెట్లు బలపడినప్పటికీ ఇరాన్–యూఎస్ యుద్ధంతో చివర్లో డీలా పడ్డాయి. వెరసి గత వారం సెన్సెక్స్ నికరంగా 249 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుంది. 76,914 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు(0.4 శాతం) వృద్ధితో 23,998 వద్ద స్థిరపడింది. అయితే బ్యాంక్ నిఫ్టీ 2.2 శాతం పతనమైంది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.3 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ 2 శాతం జంప్చేయడం గమనార్హం!
సాంకేతికంగా చూస్తే..
ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణుల అంచనా. వీటి ప్రకారం నిఫ్టీకి 23,800–23,700 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ లభించవచ్చు. తదుపరి 23,500 వద్ద బలమైన మద్దతుకు వీలుంది. ఒకవేళ బలపడితే 24,600 పాయింట్లను తాకవచ్చు. ఆపై 24,700– 27,800కు చేరే అవకాశముంది.
సెన్సెక్స్ 76,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ తీసుకునే వీలుంది. 77,500వరకూ పుంజుకోవచ్చు. 78,000 దాటితే 78,500 పాయింట్లను తాకే అవకాశముంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్


