
సాంకేతిక సహకార అవకాశాలు అందిపుచ్చుకోండి
ఐటీ దిగ్గజాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు
శాన్ఫ్రాన్సిస్కో: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని ఐటీ దిగ్గజాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాంకేతిక సహకారం, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ట్యూరింగ్ సీఈవో జొనాథన్ సిద్ధార్్థ, డేటా రోబో సీఈవో దేబాంజన్ సాహా తదితరులతో మంత్రి సమావేశమయ్యారు. మేకిన్ ఇండియా నినాదం కింద భారత్తో పాటు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ టెక్నాలజీని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని థామస్ కురియన్ బృందాన్ని ఆమె కోరారు.
భారత ఏఐ మిషన్ను ఈ సందర్భంగా కురియన్ ప్రశంసించారు. మరోవైపు, సిద్ధార్్థతో సమావేశంలో కృత్రిమ మేథకు సంబంధించి భారత్ పాలసీలను మంత్రి వివరించారు. ఏఐ విభాగంలో భారతీయ సంస్థలతో కలిసి పనిచేయడంపై సిద్ధార్థ్ ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎక్స్లో ఆర్థిక శాఖ పోస్ట్ చేసింది. కృత్రిమ మేథలో సూపర్పవర్గా ఎదిగే సత్తా భారత్కి ఉందని, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో తాము కూడా భాగం కావాలని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్కి దేబాంజన్ సాహా తెలిపారు. అటు వివిధ పెన్షన్ ఫండ్ మేనేజర్లు, ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లతో రౌండ్టేబుల్ కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. ఇంధన రంగం, పర్యావరణహిత ప్రాజెక్టులు, గిఫ్ట్–ఐఎఫ్ఎస్సీ మొదలైన వాటిల్లో పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలను ఆమె వివరించారు.
సంస్కరణల దన్ను..
వచ్చే రెండు దశాబ్దాల పాటు నిలకడగా వృద్ధి సాధించడమనేది సాహసోపేత సంస్కరణలతో పాటు దేశీయంగా సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులను దీటుగా ఎదుర్కొనే విధంగా సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు ఉండటం కూడా కీలకమని హూవర్ ఇనిస్టిట్యూషన్లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు.
గత దశాబ్దకాలంగా ప్రభుత్వం పలు నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని, 20,000 పైగా నిబంధనలను సరళీకరించడంతో పాటు వ్యాపార చట్టాల్లో క్రిమినల్ సెక్షన్లను తగ్గించిందని, ప్రభుత్వ సర్విసులను డిజిటలీకరించిందని మంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయడంతో పాటు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా తయారీ రంగ ఆధారిత వృద్ధికి బాటలు వేసినట్లు వివరించారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయ్యే 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలని భారత్ నిర్దేశించుకుందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను విస్మరించకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.