ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.. ఇతర కార్ల మాదిరిగానే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను అభివృద్ధి చేస్తోంది. ఈ వాహనాలను జూన్లో ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
నాగ్పూర్లో నిర్వహించిన 19వ రోజ్గార్మేళాలో గడ్కరీ మాట్లాడుతూ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల వినియోగం చాలా సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల గురించి చెబుతూ.. తాను టయోటా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం ఉపయోగిస్తున్న విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా.. మారుతి సుజుకి ఇథనాల్తో నడిచే వాహనాలను విడుదల చేయనుందని గడ్కరీ చెప్పారు. టయోటా, టాటా, మహీంద్రా, సుజుకి వంటి కంపెనీలు ఇప్పటికే అటువంటి వాహనాలపై పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఫ్లెక్స్-ఫ్యూయల్తో నడిచే ద్విచక్ర వాహనాలు కూడా రావడం ప్రారంభమయ్యాయి. చమురు దిగుమతులను తగ్గించడానికి అందరూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని తగ్గించుకోవాలని గడ్కరీ సూచించారు.
మారుతి సుజుకి ఇప్పటికే ఫ్రాంక్స్, వ్యాగన్ ఆర్ ఆధారంగా రెండు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ (FFV) కాన్సెప్ట్లను ప్రదర్శించింది. ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాన్ని గత సంవత్సరం జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. దీనిని 2026లో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
ఇవి E85 (85% ఇథనాల్ కలిపిన పెట్రోల్) వరకు ఇథనాల్ మిశ్రమాలపై నడుస్తుంది. వ్యాగన్ ఆర్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనంగా లాంచ్ కానుంది. ఆటో ఎక్స్పో 2023, భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025 రెండింటిలోనూ ప్రదర్శించిన ఈ కార్లు దాదాపు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి.


