
నకిలీ 500 రూపాయల నోట్లు చలామణిలోకి రావడంతో.. హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ఈ నకిలీ నోట్లు చూడటానికి నిజమైనవి మాదిరిగా అనిపించడం వల్ల చాలా మంది మోసపోయే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది.
నకిలీ రూ. 500 నోట్లను గుర్తించడం కొంత కష్టతరంగా ఉండటంతో.. చాలామంది మోసపోతున్నారు. అయితే నిజమైన రూ. 500 నోటుకు, నకిలీ నోటుకు ఓ చిన్న తేడా ఉంది. దీనిని గమనిస్తే.. ఏది నకిలీ నోటు అనేది సులభంగా తెలుసుకోవచ్చు.
ఒరిజినల్ రూ. 500 నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RESERVE BANK OF INDIA) అని అక్షరాలు ఉండటం గమనించే ఉంటారు. అయితే నకిలీ నోటు మీద కూడా RESERVE BANK OF INDIA అని ఉంటుంది. కానీ RESERVE అనే పదంలోని.. చివరి E స్థానంలో A ఉంటుందని అధికారులు వెల్లడించారు.
నకిలీ నోట్లు మార్కెట్లోకి రావడంతో.. ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నకిలీ నోట్లను గురించికపోతే నష్టపోతారని హెచ్చరించారు. నకిలీ నోట్లను చలామణీ చేసే ముఠాలను పట్టుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.