ఎన్నికల పర్వం.. మీ అభ్యర్థి గురించి తెలుసా.. డబ్బు పంచితే.. | Election Commission Of India Introduce Mobile Apps For Better Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల పర్వం.. మీ అభ్యర్థి గురించి తెలుసా.. డబ్బు పంచితే..

Apr 5 2024 10:16 AM | Updated on Apr 5 2024 12:49 PM

Election Commission Of India Introduce Mobile Apps For Better Elections - Sakshi

దేశంఅంతటా సార్వత్రిక ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎ‍న్నికల పర్వం మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే చాలామందికి వారి నియోజకవర్గంలోని అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. అందులో అభ్యర్థుల పూర్తి వివరాలు పొందుపరిచారు. దాంతో ఓటర్లు పార్టీ అభ్యర్థులకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకునే వీలుందని ఈసీ చెప్పింది. దాంతోపాటు చివరి నిమిషంలో గెలుపే లక్ష్యంగా పోటీదారులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా చాలాచోట్ల డబ్బు పంచే అవకాశం ఉంది. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ఈసీ మరో యాప్‌ను ప్రారంభించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

నో యువర్‌ క్యాండిడేట్‌(కేవైసీ) యాప్‌

మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్‌ క్యాండిడేట్‌’ (కేవైసీ) యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వేదికలు రెండింటి మీదా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థుల నేర చరిత్రతో పాటు ఆర్థిక స్థితిగతులనూ తెలుసుకోవచ్చు. ఇది ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుందని కమిషన్‌ తెలిపింది. అభ్యర్థుల పేరుతో సెర్చ్‌ చేసి, సమాచారాన్ని పొందొచ్చు. నేరాలకు పాల్పడి ఉన్నట్టయితే అవి ఎలాంటివో కూడా ఇందులో కనిపిస్తాయి.

ఇదీ చదవండి: ‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’

సి-విజిల్‌ యాప్‌

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచటం వంటి వాటికి పాల్పడుతుంటే దీని సాయం తీసుకోవచ్చు. దీని ద్వారా ఫొటో తీసి లేదా వీడియోను రికార్డు చేసి ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు. యాప్‌లోని జీఐఎస్‌ మ్యాప్స్‌ ఫీచర్‌ దానంతటదే లొకేషన్‌ను గుర్తిస్తుంది. ఫిర్యాదు జిల్లా కంట్రోల్‌ రూమ్‌కు, అక్కడి నుంచి ఫీల్డ్‌ యూనిట్‌ అధికారులకు చేరుతుంది. లొకేషన్‌ ఆధారంగా సంఘటన జరిగిన చోటును గుర్తిస్తారు. కంప్లెయింట్‌ను ధ్రువీకరించి ఎన్నికల సంఘానికి చెందిన నేషనల్‌ గ్రీవెన్స్‌ పోర్టల్‌కు పంపిస్తారు. ఫిర్యాదు చేసినవారికి దాని స్థితిగతులను 100 నిమిషాల్లో తెలియజేస్తారు.

ఇదీ చదవండి.. ఆంధ్రప్రదేశ్ ఎంపీ అభ్యర్థుల జాబితా: జిల్లాల వారి లిస్ట్ (ఫోటోలు)

Advertisement
 
Advertisement
Advertisement