ఒకేరోజు రూ.3.53 నుంచి రూ.2.36 లక్షలకు చేరిన స్టాక్‌! | Elcid Investments unprecedented 66,92,535 percent surge in a day | Sakshi
Sakshi News home page

ఒకేరోజు రూ.3.53 నుంచి రూ.2.36 లక్షలకు చేరిన స్టాక్‌!

Oct 30 2024 2:19 PM | Updated on Oct 30 2024 2:52 PM

Elcid Investments unprecedented 66,92,535 percent surge in a day

ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే స్మాల్ క్యాప్ స్టాక్ భారీగా పెరిగి రికార్డు నమోదు చేసింది. అక్టోబర్‌ 29న పెరిగిన స్టాక్‌ విలువ ఏకంగా ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లోనే ఖరీదైన స్టాక్‌గా మారింది. ఈ స్టాక్‌ ధర ఒక్క ట్రేడింగ్ సెషన్‌లో ఏకంగా 66,92,535 శాతం దూసుకుపోయింది. దాంతో గతంలో రూ.3.53గా ఉండే స్టాక్‌ ధర కాస్తా రూ.2,36,250కు చేరింది. ఇండియాలోనే ఇప్పటి వరకు ఖరీదైనా స్టాక్‌గా ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ షేర్‌ ధర రూ.1.2 లక్షలును మించిపోయింది.

షేర్‌ ధర రూ.3.53 వద్ద ఎందుకుందంటే..

2011 నుంచి ఒక్కో షేరు ధర దాదాపు రూ.3గా ఉంది. కానీ ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక్కో షేర్‌ పుస్తక విలువ(వాస్తవ విలువ) రూ.5,85,225గా ఉంది. ఇలా కంపెనీ స్టాక్‌ల వాస్తవ విలువ ఆకర్షణీయంగా ఉండడంతో కంపెనీ షేర్లు ఎవరూ అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో షేర్ల ట్రేడింగ్‌ కొరత ఎక్కువైంది. తక్కువ ట్రేడింగ్‌ వాల్యూమ్‌ల కారణంగా స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ నిలిపేశారు. ఫలితంగా దాదాపు ఒక దశాబ్దం పాటు స్టాక్ ధర సింగిల్ డిజిట్‌లోనే ఉంది.

ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్‌ చేయడానికి సిద్ధం’

ఎందుకు అంత పెరిగిందంటే..

ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ వాల్యుయేషన్‌కు అనుగుణంగా ప్రత్యేక సెషన్‌ను నిర్వహించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. దాంతో ఎల్సిడ్ వాటాదారుల పంట పండినట్లయింది. కొత్త మెకానిజంలో భాగంగా లిక్విడిటీని మెరుగుపరచడం, సరసమైన ధరల ఆవిష్కరణను సులభతరం చేయడం లక్ష్యంగా హోల్డింగ్ కంపెనీలకు ఎటువంటి ప్రైస్ బ్యాండ్‌లు విధించలేదు. దాంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నిర్వహించిన ప్రత్యేక కాల్ ఆక్షన్‌ సెషన్‌లో స్టాక్‌ ధర భారీగా పెరిగింది. మంగళవారం కొన్ని షేర్లు చేతులు మారిన తర్వాత, బుధవారం ఉదయం ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement