
భారత వైమానిక దళంలో కీలకంగా ఉన్న రఫేల్ యుద్ధవిమానాల తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్లు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాయి. ఇరు కంపెనీలు భారత్, ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం రఫేల్ యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి నాలుగు ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ ఒప్పందాలపై ఈమేరకు సంతకాలు చేశాయి. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం.
దేశ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, ప్రపంచ సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా డసో ఏవియేషన్ తెలిపింది. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఈ తయారీ కేంద్రం భారతదేశ ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల్లో కీలకమైన పెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొంది.
ఈ ఒప్పందంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లో రఫేల్కు చెందిన లేటరల్ షెల్స్, పూర్తి వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజ్లేజ్ సెక్షన్, ఫ్రంట్ సెక్షన్ వంటి కీలక నిర్మాణ విభాగాల తయారీకి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఫ్యూజ్లేజ్ విభాగాలు 2028లో అసెంబ్లింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇరు కంపెనీలు తెలిపాయి. ఈ సదుపాయం ద్వారా నెలకు రెండు ఫ్యూజ్లేజ్లను డెలివరీ చేయనున్నట్లు చెప్పాయి.
రఫేల్ యుద్ధ విమానాలను తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల హైదరాబాద్లో ఉత్పత్తి చేయనున్నారు. ‘భారతదేశంలో సరఫరా గొలుసును బలోపేతం చేయడంలో ఇది ఒక నిర్ణయాత్మక దశ. భారత ఏరోస్పేస్ పరిశ్రమలో ప్రధాన సంస్థల్లో ఒకటైన టీఏఎస్ఎల్తో సహా స్థానిక భాగస్వాముల విస్తరణకు కట్టుబడి ఉన్నాం’ అని డసో ఏవియేషన్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎరిక్ ట్రాపియర్ అన్నారు.
ఇదీ చదవండి: ఆడుతూ.. పాడుతూ.. డబ్బు పాఠాలు
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సుకరణ్ సింగ్ మాట్లాడుతూ ‘ఈ భాగస్వామ్యం భారతదేశ ఏరోస్పేస్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ. భారతదేశంలో పూర్తి రఫేల్ ఫ్యూజ్లేజ్ ఉత్పత్తికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు పూర్తి సామర్థ్యాలున్నాయి. ఆధునిక, బలమైన ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ను స్థాపించడంలో భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతిని ఈ ఒప్పందం హైలైట్ చేస్తుంది’ అని అన్నారు. ఈ ఒప్పందాలపై సంతకాలు చేయడం భారతదేశం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ కార్యక్రమాల పట్ల డసో ఏవియేషన్ నిబద్ధతతో ఉందని అధికారులు తెలిపారు.