
ప్రతి ఇంట్లో వాడే పాల ధరలు త్వరలో తగ్గనున్నాయి. ప్యాకేజ్డ్ మిల్క్ పై 5 శాతం జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన వెంటనే దేశంలోని దాదాపు అన్ని బ్రాండ్ల పాల ప్యాకెట్ల ధరలపైనా తక్షణ ఉపశమనం లభించనుంది.
ఈ జీఎస్టీ మినహాయింపు నేరుగా సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే పాలపై 5% పన్ను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఉండదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో పాలు వంటి నిత్యావసర వస్తువులను మరింత అందుబాటులో ధరల్లోకి తీసుకురావాలనేది ఈ చర్య ఉద్దేశం.
దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న ప్రముఖ పాల ఉత్పత్తుల బ్రాండ్లలో ఒకటైన అమూల్, మదర్ డెయిరీ ప్రస్తుత ధరలు, జీఎస్టీ తొలగింపు అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత తగ్గుతాయన్నది ఈ కింద చూద్దాం. అమూల్ ఉత్పత్తులలో ఫుల్ క్రీమ్ మిల్క్ 'అమూల్ గోల్డ్' ధర ప్రస్తుతం లీటరుకు రూ. 69 కాగా, టోన్డ్ మిల్క్ రూ.57. అదే విధంగా మదర్ డైరీ ఫుల్ క్రీమ్ మిల్క్ రూ. 69, టోన్డ్ మిల్క్ సుమారు రూ.57 ఉంది. గేదె, ఆవు పాలు ధరలు కూడా రూ.50-75 మధ్య ఉన్నాయి.
జీఎస్టీ ఎత్తివేసిన తర్వాత ధరలు ఎంత తగ్గుతాయి?
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం పాల ధరలు లీటరుకు రూ.3 నుంచి రూ.4 వరకు తగ్గుతాయి. ఉదాహరణకు, అమూల్ గోల్డ్ ధర సుమారు రూ .65-66 కు తగ్గుతుంది, మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర కూడా అదే స్థాయిలో తగ్గుతుందని భావిస్తున్నారు. టోన్డ్ మిల్ఖ్, గేదె పాలపై కూడా ఇలాంటి ఉపశమనం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది వినియోగించే విజయ ప్యాకేజ్డ్ పాలు కూడా జీఎస్టీ మినహాయింపు తర్వాత లీటర్కు రూ.2 నుంచి రూ.3 తగ్గే అవకాశం ఉంది.
పాల రకం | ప్రస్తుత ధర (లీటరుకు) | కొత్త ధర (లీటరుకు) |
---|---|---|
అమూల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్) | ₹69 | ₹65–66 |
అమూల్ ఫ్రెష్ (టోన్డ్) | ₹57 | ₹54–55 |
అమూల్ టీ స్పెషల్ | ₹63 | ₹59–60 |
అమూల్ గేదె పాలు | ₹75 | ₹71–72 |
అమూల్ ఆవు పాలు | ₹58 | ₹55–57 |
మదర్ డైరీ ఫుల్ క్రీమ్ | ₹69 | ₹65–66 |
మదర్ డైరీ టోన్డ్ మిల్క్ | ₹57 | ₹55–56 |
మదర్ డైరీ గేదె పాలు | ₹74 | ₹71 |
మదర్ డైరీ ఆవు పాలు | ₹59 | ₹56–57 |