
ఏటా వాహనాలు పెరుగుతుండడంతో రోడ్లపై ట్రాఫిక్జామ్ అధికమవుతోంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సంఘటన పెరిగిన ట్రాఫిక్కు అద్దం పడుతోంది. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితురాలిని ఎయిర్పోర్ట్లో దింపి ఇంటికి వెళ్లాలని చూసిన ఓ యువతికి ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. దాంతో ఈమె ట్రాఫిక్ దాటుకొని ఇంటికెళ్లేలోపు తన ఫ్రెండు దుబాయ్ చేరిపోయింది. ఈ వివరాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది.
కంటెంట్ క్రియేటర్లు ప్రియాంక, ఇంద్రయాణి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నా స్నేహితురాలు దుబాయ్ బయలుదేరుతుండగా బెంగళూరు విమానాశ్రయంలో డ్రాప్ చేశాను. కొద్దిసేపటికి ఆమె దుబాయ్ చేరుకున్నట్లు సమాచారం అందించింది. కానీ నేను అప్పటికీ బెంగళూరు ట్రాఫిక్లోనే చిక్కుకుపోయాను’ అని పోస్ట్ చేశారు. ‘యదార్థ సంఘటనల ఆధారంగా..’ అని హెడ్డింగ్తో పోస్ట్ చేసిన ఈ వివరాలు వైరల్గా మారాయి. ఇప్పటివరకు ఈ పోస్ట్కు 19 మిలియన్లకు పైగా వ్యూస్, మిలియన్ కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి.
దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘బెంగళూరులో కారులో 1 కి.మీ వెళితే 3 గంటలు.. కాలినడక ద్వారా వెళితే 1 కి.మీకు 10 నిమిషాలు సమయం పడుతుంది’ అని ఒక యూజర్ తెలిపారు. ‘ఇతర రాష్ట్రం నుంచి రెండు గంటలు ఫ్లైట్ ఎక్కి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చిన నేను.. ఇంటికి వెళ్లేందుకు ఐదు గంటలు పట్టింది’ అని మరోవక్తి చెప్పారు.
ఇదీ చదవండి: ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..
జనాభా పెరుగుదల, ఐటీ బూమ్కు అనుగుణంగా బెంగళూరులో మౌలిక సదుపాయాలు లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. విమానాశ్రయం సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. రద్దీ సమయాల్లో, ఇంటికి తిరిగి ప్రయాణించేందుకు చాలా సమయం పడుతోంది. ఇది చాలా దేశీయ లేదా తక్కువ దూరంలో ఉన్న అంతర్జాతీయ విమానాల సమయం కంటే చాలా ఎక్కువ అనే వాదనలున్నాయి.