మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, చమురు సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడటంతో తన దేశీయ ఇంధన అవసరాలను అదుపులో ఉంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.
కొత్త పని గంటలు
పెరుగుతున్న ఇంధన ధరలు, చమురు సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను తక్షణమే అమలులోకి తెచ్చింది.
ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. గతంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేసేవి.
మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, ముఖ్యంగా డెకరేటివ్ లైటింగ్(వేడుకల్లో ఉపయోగించే విద్యుత్)పై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
విద్యా రంగంలో మార్పులు
పాఠశాలల పని వేళలపై విద్యాశాఖ త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో.. పాఠశాల సమయాలను సర్దుబాటు చేయడం, అవసరమైతే ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించేందుకు పాఠశాలల కోసం ఎలక్ట్రిక్ బస్సుల దిగుమతులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించనున్నట్లు అంచనా.
ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు


