భారతీ ఎయిర్టెల్ కొత్త చందాదారులను ఆకర్షించడంలో వరుసగా మూడో నెలలోనూ ముందుంది. ఫిబ్రవరిలో 48.5 లక్షల కొత్త చందాదారులను తన నెట్వర్క్లో భాగం చేసుకుంది. వైర్లైన్ కూడా కులుపుకుంటే ఎయిర్టెల్ మొత్తం మీద 50.88 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. జియో నికరంగా 17.41 లక్షల చందాదారులను (మొబైల్ విభాగంలో 16.24 లక్షలు) ఆకర్షించింది.
మొత్తం మీద ఫిబ్రవరి చివరికి మొబైల్, ఫిక్స్డ్ వైర్లెస్ కనెక్షన్ల సంఖ్య 127.33 కోట్లకు పెరిగింది. వొడాఫోన్ ఐడియా ఇటీవలి కాలంలోనే మొదటిసారి 21,927 మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. ఇక బీఎస్ఎన్ఎల్ 1.01 లక్షల కస్టమర్లను కోల్పోయింది. జియో నికర చందాదారులు 51.96 కోట్లకు పెరిగారు. 36.4 కోట్ల చందాదారులతో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంటే, 12.93 కోట్ల కస్టమర్లతో వొడాఫోన్ ఐడియా, 2.8 కోట్ల కస్టమర్లతో బీఎస్ఎన్ఎల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
గ్లోబల్గా రెండో స్థానంలో ఎయిర్టెల్
అంతర్జాతీయంగా 65 కోట్ల మంది సబ్ర్స్కయిబర్స్తో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం ఆపరేటరుగా భారతి ఎయిర్టెల్ నిల్చింది. మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న జీఎస్ఎంఏ ఇంటెలిజెన్స్ గణాంకాలను ఉటంకిస్తూ కంపెనీ ఈ విషయాలు తెలిపింది. ఎయిర్టెల్కి భారత్లో 36.8 కోట్ల మంది, ఆఫ్రికాలోని 14 దేశాల్లో 17.9 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వినూత్న ఆవిష్కరణలు, విశ్వసనీయత ప్రాతిపదికన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు భారతి ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ తెలిపారు.


