● కొన్ని విభాగాల్లో మరమ్మతులు చేపట్టాల్సి ఉంది ● భద్రాచలం ఏరియా ఆస్పత్రి పరిశీలనలో బీఎస్ఐ బృందం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సేవలు బాగున్నాయి. అయితే కొన్ని విభాగాల భవనాలకు మరమ్మతులు కూడా చేపట్టాల్సి ఉందని బీఎస్ఐ బృందం అభిప్రాయపడింది. బుధవారం నలుగురు సభ్యులు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ప్రియాంక, శ్రీకాంత్, రాధలతో కూడిన బీఎస్ఐ (బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్) బృందం ఆస్పత్రిని సందర్శించింది. సభ్యులు అన్ని వార్డులు, ఔట్ పేషెంట్, అత్యవసర సేవలు, ఇన్ పేషెంట్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, లేబర్ రూమ్, స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్, ల్యాబ్, రక్తనిధి కేంద్రం, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. 10 విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్నట్లు గుర్తించారు. పలు విభాగాల్లో సదుపాయాలు బాగున్నా భవనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. నెల రోజుల తర్వాత మరోసారి బీఎస్ఐ బృందం సందర్శించనున్నారు. మూడేళ్లపాటు మెరుగైన సేవలందిస్తే ఐఎస్ఐ సర్టిఫికెట్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత భవనంలో ఏర్పాటు చేసిన ల్యాబ్, ఓటీ, దోబీ, ఇతర విభాగాల భవనానికి మరమ్మతులు చేయాలని సభ్యులు సూచించారు. తొలుత సమావేశం నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు నాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


