పాల్వంచరూరల్: జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులుల సంతతి పెరగాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా బుధవారం వైల్డ్లైఫ్ శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ ఎఫ్డీఓ కార్యాలయం నుంచి కిన్నెరసాని డీర్పార్కు వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీర్ పార్కు వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పులులు సంచరించేలా జిల్లా అడవులను తయారు చేయాలన్నారు. కిన్నెరసాని పర్యాటక ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కిన్నెరసానిలో లక్నవరంలో మాదిరిగా తీగల వంతన నిర్మించాలని అధికారులను కోరారు. గిరిజన డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. సీపీఎఫ్ డాక్టర్ భీమానాయక్ మాట్లాడుతూ ఇక్కడి అడవిని పులులకు సేఫ్ జోన్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అడవుల నరికివేత, పోడు సాగు, వన్యప్రాణుల వేట కారణంగా పులులు జిల్లా అడవిలో ఆవాసం ఉండలేకపోతున్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎకో టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఎఫ్డీఓలు బి.బాబు, కృష్ణప్రసాద్, గిరిజన గురుకుల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, రేంజర్లు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని


