తొట్లు బాగుచేస్తే పది లక్షల
చేపపిల్లల పెంపకం
పట్టించుకోని అధికారులు
పాల్వంచరరూరల్: మరమ్మతులు చేయక నిరుపయోగంగా ఉన్న తొట్లను బాగుచేస్తే మరో పది లక్షల చేప పిల్లలను పెంచుకునే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలోని కిన్నెరసానిలో గల చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో 20 లక్షల చేప పిల్లల పెంపకం కోసం మొత్తం 12 నీటి తొట్లు ఉన్నాయి. వీటి మరమ్మతుల కోసం 2017లో రూ.53 లక్షల నిధులను అప్పటి పశు సంవర్ధకశాఖ, మత్స్య, పాల ఉత్పత్తుల అభివృద్ధి, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంజూరు చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిధుల ద్వారా 8 కొత్త తొట్లను నిర్మించి, మరో నాలుగు తొట్లకు మరమ్మతులు చేశారు. మొత్తం 12 తొట్ల మరమ్మతులకు మంజూరైన నిధులను ఖర్చుచేశారు. మిగిలిన, లీక్ అవుతున్న మరో నాలుగు తొట్లను నిధుల కొరత కారణంగా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో పది తొట్లలో ఏటా 10 లక్షల చేపపిల్లలను మాత్రమే పెంచుతున్నారు. ఇక్కడ పెంచిన చేప పిల్లలను పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు మండలాల్లో మత్స్యసహకార సొసైటీలకు పంపిణీ చేస్తుంటారు. ఉన్న నాలుగు తొట్లకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు నిర్వహిస్తే ఏటా మరో పది లక్షల చేపపిల్లలను పెంచే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం నిధులు మంజూరు చేయకుండా వదిలేశారు.
స్పాన్ ద్వారా పిల్లల పెంపు
కిన్నెరసానిలోని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఇతర ప్రాంతం నుంచి చేపపిల్లల గుడ్లు (స్పాన్) తీసుకొచ్చి ఇక్కడి నీటితొట్లలో పోసి, రెండు నెలలపాటు 35 – 40 ఎంఎం సైజు వరకు పెంచిన తర్వాతా మూడు మండలాల్లోని 46 సొసైటీలకు పంపిణీ చేస్తారు. చేపపిల్లల పెంపుకోసం ఉన్న తొట్లు సరిపోవడం లేదంటే ఇందులో మరో రెండు తొట్లను గంబూజ్ చేపల పెంపు కోసం ఐటీడీఏకు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం పది తొట్లలో మాత్రమే నామమాత్రంగా చేపపిల్లలను పెంచి మత్స్య సొసైటీలకు అరకొరగా సరఫరా చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కిన్నెరసాని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న నీటితొట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి చేపపిల్లల ఉత్పత్తి సంఖ్యను పెంచాలని మత్స్య సొసైటీ సభ్యులు కోరుతున్నారు. మరమ్మతులకు గురైన చేపపిల్లల తొట్లను పునరుద్ధరించేందుకు గాాను రెండేళ్ల కిందట రూ.40 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోలేదు.


