ఖమ్మంగాంధీచౌక్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆలయాల్లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు గ్రేడ్–3 ఈఓలుగా పదోన్నతి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో మేనేజర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు గ్రేడ్–3 ఈఓలుగా దేవాదాయశాఖ ఉద్యోగోన్నతి కల్పించింది. ఈ మేరకు హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ఉత్తర్వులు అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లగూడెం పులిగుండాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ డి.శ్రీనివాసరావు, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి మారెమ్మ తల్లి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బేబీ సరోజన, ఖమ్మం కాల్వొడ్డు ఆలయంలో నియమితులైన జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డిలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నియమితులై, ఖమ్మం శ్రీగుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో మేనేజర్గా పనిచేస్తున్న చండూరు రామకోటేశ్వరరావు, భద్రాచలం అభయాంజనేయ స్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న విజయలక్ష్మికి గ్రేడ్–3 ఈఓలుగా పదోన్నతి కల్పించారు. వీరికి కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
కౌన్సెలింగ్ ద్వారా
కొద్ది రోజుల్లో పోస్టింగ్


